Ban on Gas stoves | గ్యాస్ స్టౌవ్ల విషయంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుందా ? ఇళ్లల్లో గ్యాస్ స్టౌవ్లపై నిషేధం విధించాలని యోచిస్తోందా ? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అమెరికా వినియోగదారుల రక్షణ కమిషన్ తాజాగా గ్యాస్ స్టౌవ్లపై నిషేధం విధించాలని యోచిస్తున్నట్లు ప్రకటించడం ఇప్పుడు చర్చానీయాంశమైంది. గ్యాస్ స్టౌవ్ వాడకం వల్ల పర్యావరణం సహా ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందన్న ఓ ఇంటర్నేషనల్ జర్నల్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కొత్త గ్యాస్ స్టౌల విషయంలోనే ఆంక్షలు విధించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అమెరికాలో ఆందోళన వ్యక్తమవుతోంది.
కాగా, ఇది అమెరికాలో గ్యాస్ స్టౌ వినియోగించే 4 కోట్ల గృహవినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపించనుందని సెనేట్ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా వినియోగదారుల కమిషన్.. గ్యాస్ స్టౌవ్లపై ఎందుకు నిషేధం విధించాలనుకుంటో అర్థం కావడం లేదని, ఇప్పటికిప్పుడు వచ్చే ప్రమాదం ఏముంది ? అని బైడెన్ ప్రభుత్వాన్ని అమెరికా సెనేటర్ జో మంచిన్ ప్రశ్నించారు.
గ్యాస్ స్టౌవ్లపై ఎందుకు నిషేధం?
గ్యాస్ స్టౌవ్ల వల్ల చిన్న పిల్లల్లో అస్తమా కేసులు పెరిగిపోతున్నాయని నివేదికలో తేలింది. అమెరికాలోప్రతి 8 మంది చిన్నారుల్లో ఒకరు గ్యాస్ స్టౌవ్ల వల్లే అస్తమా బారిన పడుతున్నారని తేలింది. గ్యాస్ స్టౌవ్ల నుంచి వెలువడుతున్న విషపూరితమైన రసాయనాలే ఇందుకు కారణమని అధ్యయన నివేదికలో పేర్కొన్నారు.
అధ్యయనంలో ఏముంది?
గ్యాస్ స్టౌవ్ల నుంచి వెలువడే నైట్రోజన్ డయాక్సైడ్ వంటి కాలుష్య కారకాల వల్లే చిన్న పిల్లల్లో అస్తమా సమస్యలు తలెత్తుతున్నాయట. అమెరికా, ఆస్ట్రేలియాలోని పలువురు అంటు వ్యాధుల నిపుణులతో కలిసి ఆర్ఎంఐలోని కార్బన్ ఫ్రీ బిల్డింగ్ ప్రోగ్రాం మేనేజర్ బ్రాడీ సీల్స్ తాజాగా పరిశోధన చేపట్టారు. అమెరికాలో 12.7 శాతం పిల్లల్లో అస్తమా సమస్యలకు ఇదే కారణమని తేలింది. అస్తమాకు ధూమపానం ఎంత వరకు కారణమో అదే స్థాయిలో గ్యాస్ స్టౌవ్లు కూడా కారణమవుతున్నాయిని బ్రాడీ సీల్స్ పేర్కొన్నారు. ఈ సమస్య గురించి అందరికీ తెలుసు కానీ ఎంత ప్రమాదకరమన్న విషయంపై మాత్రం అవగాహన లేదని అన్నారు. గ్యాస్ స్టౌవ్లు నిషేధించినట్లైతే ప్రస్తుతం చిన్నపిల్లల్లో నమోదవుతున్న అస్తమా కేసులను 12.7 శాతం అరికట్టవచ్చని పేర్కొన్నారు. గతంలోనూ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా ఇదే విషయాన్ని వెల్లడించారని ఆమె గుర్తు చేశారు.
ఎలక్ట్రిక్ స్టౌవ్లకు మారితే రాయితీలు..
అమెరికాలో ప్రస్తుతం దాదాపు 4 కోట్ల మంది గ్యాస్ స్టౌవ్ వినియోగదారులున్నారు. గ్యాస్ స్టౌవ్ నుంచి ఎలక్ట్రిక్ స్టౌవ్లకు మారే వారికి సహకారం అందించేందుకు అమెరికా కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణ నియంత్ర చట్టంలో మార్పులు చేసింది. గ్యాస్ స్టౌవ్ నుంచి ఎలక్ట్రిక్ స్టౌవ్లకు మారే వారికి 840 డాలర్లు రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మరోవైపు అమెరికాలో గ్యాస్ స్టౌవ్లపై నిషేధంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో బైడెన్ ప్రభుత్వం దీనిపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
Follow Us : Google News, Facebook, Twitter