Oscars | ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి నాటు నాటు సాంగ్ నామినేట్ కావడంతో ఇప్పుడు ఆస్కార్ అవార్డులపై మనవాళ్లకు ఫోకస్ ఎక్కువైపోయింది. మరికొద్దిగంటల్లో అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా ప్రారంభం కానున్న నేపథ్యంలో అసలు ఈ అవార్డు ఏంటి? అవార్డు గెలిచిన వాళ్లకు ఎలాంటి బహుమతులు వస్తాయనే విషయాలపై చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఆస్కార్కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన నటీనటులు, దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణులకు అందించబోయే బహుమతుల గురించి ఒక విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే రెడ్ కార్పెట్ బదులు షాంపైన్ కార్పెట్ పరుస్తున్నారు. మళ్లీ ఇప్పుడు కానుకల బదులు భూములు ఇస్తామనే సరికి ఈ విషయం వైరల్గా మారింది.
సాధారణంగా ప్రతిసారి ఆస్కార్ నామినీలకు అకాడమీ కాకుండా అద్భుతమైన బహుమతులు ఇస్తుంటారు. దీనికోసం అకాడమీతో సంబంధం లేకుండా చాలా వ్యాపార సంస్థలు పోటీపడుతుంటాయి. ఈ సారి పీసెస్ ఆఫ్ ఆస్ట్రేలియా అనే రియల్ ఎస్టేట్ సంస్థ నామినీలకు ఇచ్చే గిఫ్ట్ హాంపర్లో చోటు దక్కించుకుంది. ఇందుకోసం 4వేల డాలర్లను అకాడమీ కమిటీకి చెల్లించి గిఫ్ట్ హాంపర్లో ప్లేస్ దక్కించుకుంది. గతంలో కంటే విభిన్నంగా ఆస్కార్ నామినీలకు బహమతులు ఇవ్వాలని భావించిన పీసెస్ ఆఫ్ ఆస్ట్రేలియా తమ అస్సీ మేట్ కన్జర్వేషన్ ప్యాక్ను అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నామినీలు ఒక్కొక్కరికి ఒక్కో చదరపు మీటర్ చొప్పున భూమిని బహుమతిగా అందించబోతుంది.
క్వీన్స్ ల్యాండ్ లోని వెస్ట్రన్ డౌన్స్ ప్రాంతంలో ఉన్న ఎన్విరోషియన్ ఎస్టేట్లోనిని మొత్తం 1,21,774 చదరపు మీటర్ల స్థలాన్ని నామినీలకు బహుమతిగా ఇవ్వనుంది. దీని మొత్తం విలువ 2.5 మిలియన్ డాలరల్ వరకు ఉండొచ్చని అంచనా. ఈ భూమికి సంబంధించిన లైసెన్స్ సర్టిఫికెట్ను నామినీలకు ఇవ్వనుంది. అయితే ఆ భూమిని నామినీలు తమ అధీనంలోనికి తీసుకోలేరు. ఎందుకంటే ఆ భూమి ఆస్కార్ నామినీల పేరుతో ఉంటుంది. అంటే వారి గుర్తుగా మాత్రమే ఈ భూమి ఉంటుంది. దాన్ని విక్రయించే అధికారం కూడా ఉండదు. అయితే ఆస్కార్ నామినీలకు అందించాలని అనుకుంటున్న భూమిపై పలు పర్యావరణ సంస్థలు అభ్యంతరాలు తెలుపుతున్నాయి కూడా. మరి వీటన్నింటిని దాటుకొని నామినీలకు ఈ భూమిని అందజేస్తారో లేదో చూడాలి!
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
CM KCR | తెలంగాణ సీఎం కేసీఆర్కు స్వల్ప అస్వస్థత
Telangana Cabinet | సొంత స్థలం ఉన్న వాళ్లకు రూ.3లక్షల సాయం.. కొత్త పథకం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం