Viral News | టైం2న్యూస్, హైదరాబాద్ : ఆరేళ్ల బాలుడు.. కేన్సర్ అని తెలిసినా గుండె ధైర్యంతో ఉన్నాడు. ఆరు నెలల కంటే ఎక్కువ బతకడని తెలిసినా తల్లిదండ్రుల గురించే తపన పడ్డాడు. వాళ్లకు తెలిస్తే ఎక్కడ బాధపడతారో అని బాలుడు.. తమ కుమారుడికి కేన్సర్ అని తెలిస్తే తట్టుకోలేడని తల్లిదండ్రులు. వారు పడ్డ తపన ఆ వైద్యుడిని కదిలించింది. బాబు మృతి చెందిన తర్వాత ఇప్పుడా విషయాన్ని, మనసులోని బాధను ట్వీట్ల రూపంలో ప్రపంచానికి చెప్పి గుండె బరువు దించుకున్నాడు ఆ డాక్టర్. ఇప్పుడది నెటిజన్ల మనసును కదిలిస్తోంది. చిన్న వయసులో బాలుడి పరిణతికి నెటిజన్లు జోహార్లు చెబుతున్నారు.
” నేను ఆరునెలల కన్నా ఎక్కువ బతకను డాక్టర్.. నాకు కేన్సర్. నేను అనుభవిస్తున్న రోగ లక్షణాలను బట్టి గూగుల్ చేసి తెలుసుకున్నా. ఇది మమ్మీ డాడీకి తెలియదు. తెలిస్తే బాధపడతారు. మీరూ చెప్పకండి. చివరి రోజుల్లో వారిని సంతోషంగా చూడాలని అనుకుంటున్నా’ అంటూ వైద్యుడితో బాలుడు అన్న మాటలు డాక్టర్ గుండెను తాకాయి. వయసుకు మించిన బాలుడి పరిణతికి వైద్యుడికి నోట మాట రాలేదు.
హైదరాబాద్లో నివసిస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులైన దంపతులకు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. కొద్దిరోజులుగా అస్వస్థతో బాధపడుతుండటంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యుల బాబుకు కేన్సర్ అని చెప్పడంతో తల్లిదండ్రుల గుండెల్లో పిడుగుపడ్డట్లు అయింది. ఉన్న ఒక్క కుమారుడు ప్రాణాంతక జబ్బుతో బాధపడటం చూసి తల్లడిల్లిపోయారు. వైద్యుల సూచలన మేరకు వెంటనే చికిత్స స్టార్ట్ చేశారు. బాలుడికి ఆ విషయం తెలియకుండా జాగ్రత్తలు పడ్డారు. కానీ ఉన్నట్టుండి తనను ఆస్పత్రులకు తిప్పటం, అందుతున్న చికత్సలు చూసి బాలుడికి ఏమనిపించిందో ఏమో.. వైద్యుల ప్రిస్కిప్షన్ ఆధారంగా గూగుల్లో వెతికాడు. తనకు కేన్సర్ ట్రీట్మెంట్ ఇస్తున్న విషయం తెలుసుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఆ బాలుడు తన ప్రాణాలను తొలిచేస్తున్న కేన్సర్ గురించి ఆలోచించలేదు. అల్లారుముద్దుగా పెంచిన తల్లిదండ్రుల గురించి ఆలోచించాడు. వాళ్లకు తెలిస్తే బాధపడతారని, తెలియకుండా ఉండేందుకు ఏం చేయాలని ఆలోచించాడు. చివరి గడియల్లో వాళ్లను సంతోషంగా చూడాలనుకున్నాడు.
ఇది జరగడానికి ముందు.. తొమ్మిది నెలల క్రితం ఒక రోజు ఆ తల్లిదండ్రులు బాబును న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ వద్దకు తీసుకెళ్లారు. బాబుకు కేన్సర్ ఉందని వివరించారు. ఇప్పుడు ఫిట్స్ వస్తున్నాయని, ఆంకాలజిస్టు సూచన మేరకు ఆ వైద్యుడి వద్దకు వచ్చినట్లు చెప్పారు. కేన్సర్ వచ్చిన విషయం బాబుకు తెలియదని కూడా చెప్పారు. డాక్టర్ ఆ బాలుడి రిపోర్టులన్నీ పరిశీలించి బాలుడు మెదడు కేన్సర్తో బాధపడుతున్నాడని, దీని వల్లే కుడి కాలు, చేయి పక్షవాతం వచ్చి పనిచేయడం లేదని తల్లిదండ్రులకు చెప్పారు.
అంతలోనే “మమ్మీ.. డాడీ నేను డాక్టర్తో ఒక్క నిమిషం మాట్లాడాలి.. మీరు బయటకు వెళ్లండి” అంటూ తల్లిదండ్రులను కోరాడు. వారు బయటకు వెళ్లగానే డాక్టర్తో బాలుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. బాలుడి నోటి నుంచి వస్తున్న ఒక్కో మాట డాక్టర్ గుండెకు గుచ్చుకున్నాయి. ‘డాక్టర్ నాకు కేన్సర్ ఉంది. నాకున్న సమస్య గురించి తెలుసుకోవాలని ప్రిస్కిప్షన్ ఆధారంగా గూగుల్లో వెతికాను. ఇది అత్యంత ప్రమాదకరమైనదని తెలిసింది. ఈ వ్యాధి వచ్చిన వారు ఎక్కువ కాలం బతకరు అని ఉంది. ఈ విషయం అమ్మనాన్నకు చెప్పలేదు, మీరూ చెప్పకండి అని వేడుకున్నాడు. ఆ మాటలు వింటున్న డాక్టర్కు నోట మాట రాలేదు. కుర్చీలో అలాగే నిశ్శబ్దంగా ఉండిపోయాడు. కాస్త కుదురుకున్నాక బాబును బయటకు పంపించి..తల్లిదండ్రులను పిలిచాడు.
బాబు తనతో అన్న ఒక్కో మాటను తల్లిదండ్రులకు పూసగుచ్చినట్లు వివరించాడు. డాక్టర్ చెబుతున్న మాటలు వింటుంటే తల్లిదండ్రుల కళ్లు జలపాతాలయ్యాయి. ‘తనకు కేన్సర్ గురించి తెలుసు, మీరు తెలియనట్లే ఉండండి. చివరి సమయంలో అతడితో అనందంగా గడిపేందుకు ప్రయత్నించండి’ అని డాక్టర్ సూచించడంతో చివరి రోజుల్లో ఎక్కువ సమయం కొడుకుతోనే గడుపాలని ఆ తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. చివరి గడియల్లోనూ తమను సంతోషంగా చూడాలనుకుంటున్న కుమారుడి కోసం ఏమైనా చేయాలనుకున్నారు.
ఇద్దరూ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఆరు నెలలపాటు చిన్నారి వెన్నంటే ఉన్నారు. తమ బిడ్డకు ఇష్టమైన వంటకాలు.. కోరికలు తెలుసుకుని వాటిని తీర్చడమే పనిగా పెట్టుకున్నారు. అలా ఆరు నెలలపాటు బిడ్డకు ఇష్టమైన వంటకాలన్నీ చేసిపెట్టారు. అమెరికా తీసుకెళ్లారు. డిస్నిలాండ్ , థీమ్ పార్కుల్లో కొడుకుతో గడిపారు. తల్లిదండ్రుల ముఖంలో సంతోషాన్ని చూస్తూ ఆ బాలుడు.. కుమారుడి ముఖంలో ఆనందం చూసి ఆ తల్లిదండ్రులు బాధను కనిపించకుండా గుండెలోనే దాచుకున్నారు. దు:ఖాన్ని మనసులోనే దిగమింగారు. ఎనిమిది నెలల తర్వాత ఆ చిన్నారి తల్లిదండ్రులను వదిలి వెళ్లిపోయాడు. ఇటీవలే డాక్టర్ సుదీర్ కుమార్ను ఆ తల్లిదండ్రులు కలిశారు. కొద్ది రోజుల క్రితమే తమ కుమారుడు చనిపోయాడని చెప్పారు. చివరి సమయంలో బిడ్డతో ఆనందంగా గడపాలని చెప్పడంతో అలాగే చేసినట్లు డాక్టర్తో చెప్పారు.
Read More Articles:
Telangana Tourist Places | తెలంగాణలోని ఈ ఆలయంలో 700 ఏళ్లుగా వెలుగుతున్న అఖండజ్యోతి.. గంభీరావుపేటలోనే