Ayodhya Ram Mandir | అయోధ్య రామ మందిరంపై కీలక అప్డేట్ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. 2024 జనవరి 1న రామ మందిరాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. త్వరలో త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపంథ్యంలో అక్కడ ప్రచార శంఖారావం పూరించిన అమిత్ షా.. రామ మందిరంపై కీలక ప్రకటన చేశారు. రామాలయ నిర్మాణాన్ని కాంగ్రెస్, సీపీఐ (ఎం)లు అడ్డుకున్నాయని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. సుదీర్ఘ కాలం కోర్టు పరిధిలో ఉండేలా చూశారని ఆరోపించారు. సుప్రీంకోర్టు అనుమతివ్వడంతో ప్రధాని మోదీ వెంటనే ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారని షా గుర్తు చేశారు. అమిత్ షా ప్రకటనతో ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టి రామ మందిరంపై పడింది. అయితే.. అయోధ్యలో రామ జన్మభూమి విషయంలో వివాదం ఎప్పుడు మొదలైంది.. కోర్టు తీర్పు.. ఆలయ నిర్మాణం.. గుడి విశేషాలు ఏంటి? అనే విషయాలపై ఓ సారి లుక్కేయండి..
ఆలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్…
అయోధ్యలో ఇప్పుడు రామ మందిరం నిర్మిస్తున్న ప్రదేశాన్ని రాముడి జన్మభూమిగా హిందువులు భావిస్తారు. ఇక్కడ రామాలయం ఉండేదని, దాని స్థానంలో 16వ శతాబ్దంలో మసీదు నిర్మించారని భావిస్తారు. అయితే 500 ఏళ్ల చరిత్ర కలిగిన బాబ్రీ మసీదు 1992లో కూల్చివేతకు గురైంది. అప్పటి నుంచి ఆ స్థలంపై వివాదం నడుస్తోంది. 2019 నవంబర్ 9న అయోద్య వివాదంపై సుప్రీం కోర్టు తుది తీర్పు వెలువరించింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామ మందిరం నిర్మించేందుకు వీలుగా ట్రస్టుకు అప్పగించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ప్రత్యామ్నాయంగా మసీదు నిర్మాణం కోసం ఉత్తరప్రదేశ్ వక్ఫ్ బోర్డుకు మరో చోట 5 ఎకరాల స్థలం కేటాయించాలని తీర్పు వెలువరించింది.
ఆలయం నిర్మాణం ఎలా ఉంటుంది ?
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోవడంతో 2020 ఆగస్టు 5న ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అయోధ్యలో రామ మందిరాన్ని 2.77 ఎకరాల విస్టీర్ణంలో నిర్మిస్తున్నారు. మొదటి అంతస్తు నుంచి గర్భగుడి శిఖరం వరకు 161 అడుగుల ఎత్తు ఉండనుంది. ఆలయం పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు. ఒక్కో అంతస్థు 20 అడుగులు ఉంటుంది. మొదట అంతస్తులో 160, మొదటి అంతస్తులో 132 , రెండవ అంతస్తులో 74 స్తంభాలతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
ఆలయానికి తెలంగాణ నుంచి గ్రానైట్ రాళ్లు..
ఆలయ నిర్మాణంలో భాగంగా పునాది నింపేందుకు 17వేల గ్రానైట్ రాళ్లను ఉపయోగించారు. తెలంగాణ, కర్ణాటక నుంచి ఈ రాళ్లను తీసుకొచ్చారు. మందిరం గోడల నిర్మాణానికి 8-9 లక్షల క్యూబిక్ ఫీట్ల సున్నపురాయిని వినియోగిస్తున్నారు. పునాది కోసం 6.37 లక్షల క్యూబిక్ ఫీట్ల చెక్కిన గ్రానైట్ను ఉపయోగిస్తున్నారు. ఆలయం కోసం 4.70 లక్షల క్యూబిక్ ఫీట్ల గులాబీ రాయిని ఉపయోగించనున్నారు. గర్భ గుడి కోసం తెల్లటి మక్రానా మార్బుల్ ఉపయోగిస్తున్నారు.
ఎప్పుడేం జరిగింది ?
2019 నవంబర్ 9 అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తుది తీర్పు
2020 ఆగస్టు 5 ఆలయ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన
2021 జనవరి మందిర నిర్మాణం కోసం తవ్వకాలు ప్రారంభం
2021 మార్చి తవ్వకాల పనులు పూర్తి
2021 ఏప్రిల్ ఫౌండేషన్ ఫిల్లింగ్ వర్క్ ప్రారంభం
2021 సెప్టెంబర్ ఫిల్లింగ్ వర్క్ పూర్తి
2021 సెప్టెంబర్ టవర్ క్రేన్ ఏర్పాటు
2021సెప్టెంబర్ రాఫ్ట్ వర్క్ ప్రారంభం
2021నవంబర్ రాఫ్ట్ వర్క్ పూర్తి
2021 నవంబరు శంకుస్థాపన పనులు ప్రారంభం
2022 జనవరి ఆలయ స్తంభాల ఏర్పాటు ప్రారంభం
టైమ్ క్యాప్సూల్..
ఆయోధ్య రామాలయ చరిత్ర, దీని వెనక జరిగిన పరిణామాలు, వాస్తవాలు, వివాదాలన్నింటినీ తేదీలతో సహా పట్టిక తయారుచేశారు. ఈ టైమ్ క్యాప్సుల్ని రామాలయం నిర్మించే ప్రదేశంలో 2000 అడుగుల లోతున భద్రంగా దాచిపెట్టారు. భవిష్యత్తులో ఎవరైనా ఈ ఆలయంపై వివాదానికి తెర తీస్తే ఈ టైమ్ క్యాప్సుల్ ద్వారా సమాధానం దొరకనుందని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు కమలేశ్వర్ చౌపాల్ తెలిపారు. ఎవరైనా భవిష్యత్తులో ఆలయ చరిత్రను తెలుసుకోవాలనుకుంటే ఈ టైమ్ క్యాప్సుల్ చక్కగా ఉపయోగపడుతుందని వివరించారు. భవిష్యత్ తరాల కోసం టైమ్ క్యాప్సుల్ తయారుచేశామన్నారు. ఆలయ నిర్మాణం కింద తామ్రపత్రం (రాగి ప్లేట్) కింద ఈ టైమ్ క్యాప్సుల్ని ఏర్పాటు చేశారు.
ఆలయ నిర్మాణ శిల్పులు వీరే..
రామాలయ నిర్మాణ పనులను గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన సోమ్ పురా ఫామిలీ చేపట్టింది. చంద్రకాంత్ సోంపురా 30 సంవత్సరాల క్రితం అయోధ్యలోని రామ్ లల్లాకు ఆలయ పనులు ప్రారంభించారు. అప్పటి విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు అశోక్ సింఘాల్తో కలిసి రామాలయ స్థలాన్ని సందర్శించారు. పారిశ్రామికవేత్త ఘనశ్యాం దాస్ బిర్లా రామ్ మందిర్ ప్రాజెక్టును చేపట్టిన సమయంలో సోంపురాను సింఘాల్కు పరిచయం చేశారు. సోంపురా అప్పటి బిర్లా దేవాలయాలలో పనిచేశారు. 1983లోనే సోంపురా రామమందిర ఆకృతికి రూపం ఇచ్చారు.
దేశ విదేశాల్లో ప్రసిద్ధ ఆలయాల రూపకర్తలుగా సోంపురా కుటుంబానికి పేరుంది. ఆలయాల నిర్మాణాలలో 15 తరాల నుండి విశేష అనుభవం ఉంది. సోమనాథ్ నుండి అయోధ్య వరకు ఆలయ నిర్మాణాలు చేపట్టింది ఆ కుటుంబమే. చంద్రకాంత్ సోంపురాతో పాటు కుటుంబసభ్యులు భారతదేశంలోనే కాదు.. విదేశాలలో 200 దేవాలయాల నిర్మాణాలు చేపట్టారు. సోమనాథ్ ఆలయాన్ని రూపొందించింది ఈ కుటుంబమే. బద్రినాథ్ ఆలయ పునరుద్ధరణ ప్రాజెక్ట్ చేసింది కూడా వీరి కుటుంబీకులే.
Read More Articles:
Swap village | ఆరు నెలలకు ఒకసారి దేశం మారే దీవి.. ఈ వింత మీకు తెలుసా !!