Karnataka teacher kills student | కర్ణాటకలో దారుణం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు నాలుగో తరగతి విద్యార్థి ప్రాణం తీశాడు. అత్యంత దారుణమైన ఈ ఘటన కర్ణాటకలోని గడగ్ జిల్లా హడ్లీ గ్రామంలో జరిగింది. విచక్షణారహితంగా కొట్టడంతో పాటు పాఠశాల మొదటి అంతస్తు నుంచి విద్యార్థిని తోసేయడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అసలేం జరిగిందంటే.. హద్లీ ప్రభుత్వ పాఠశాలలో భరత్ అనే విద్యార్థి నాలుగో తరగతి చదవుతున్నాడు. అదే పాఠశాలలో ముత్తప్ప అనే కాంట్రాక్ట్ టీచర్ పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం నాలుగో తరగతి చదువుతున్న భరత్ను ముత్తప్ప తీవ్రంగా కొట్టాడు. అదే పాఠశాలలో విద్యార్థి తల్లి గీతా బార్కర్ కూడా టీచర్గా పనిచేస్తోంది. ఉపాధ్యాయుడు తన కుమారుడిని తీవ్రంగా కొట్టాడాన్ని చూసిన ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఉపాధ్యాయుడిని ఆపేందుకు ప్రయత్నించింది. కానీ ఆ దుర్మార్గుడు ఆమెపైనా దాడి చేశాడు. అడ్డుకోబోయిన మరో ఉపాధ్యాయుడు సంగన్ గౌడ పైనా దాడి చేశాడు. అనంతరం విద్యార్థిని మొదటి అంతస్తు నుంచి కిందకి తోసేశాడు. దీంతో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ భరత్ మృతి చెందాడని పోలీసులు వెల్లడించారు.
విద్యార్థి తల్లితో పాటు మరో ఉపాధ్యాయుడికి కూడా తీవ్ర గాయాలయ్యాయని, వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థిని మొదటి అంతస్తు నుంచి తోసేసిన ముత్తప్ప పరారయ్యాడని, అతన్ని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. కాగా, ఈ ఘటనకు స్పష్టమైన కారణాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వారి మధ్య కుటుంబ వివాదాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు చెప్పారు.
Read More Articles |
Bigg Boss season 7 | బిగ్బాస్ 7 ను బాలయ్య హోస్ట్ చేస్తాడా? నాగార్జున మనసులో ఉన్న హీరో ఎవరు?