Nikhat Zareen | టైమ్ 2 న్యూస్, న్యూఢిల్లీ: ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్నకు రంగం సిద్ధమైంది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా 13వ ఎడిషన్ మెగా బాక్సింగ్ టోర్నీ బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అతిరథ మహారథుల సమక్షంలో వివిధ దేశాలకు చెందిన బాక్సర్లు జాతీయ జెండాలను చేబూని వేదికపైకి విచ్చేయగా.. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మెగాటోర్నీని ఆరంభించారు. భారత్ తరఫున తెలంగాణ స్టార్ బాక్సర్లు నిఖత్ జరీన్, లవ్లీనా బొర్గోహై ( Lovlina Borgohain ) మువ్వన్నెల జెండాతో అలరించారు.
మూడోసారి భారత్ వేదికగా జరుగుతున్న ఈ మెగాటోర్నీలో 300 మందికి పైగా విదేశీ బాక్సర్లు పోటీపడుతున్నారు. ఆతిథ్య భారత్ తరఫున 12 మంది బాక్సర్లు సత్తాచాటేందుకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా డిఫెండింగ్ చాంపియన్ నిఖత్ జరీన్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య విజేత లవ్లీనా బొర్గోహై కచ్చితంగా పతకాలు గెలుస్తారన్న అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది జరుగనున్న పారిస్ ఒలింపిక్స్ను దృష్టిలో పెట్టుకుని తమ విభాగాలను మార్చుకున్న నిఖత్ (50 కేజీలు), లవ్లీనా (75 కేజీలు) ఏ మేరకు రాణిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. దిగ్గజ బాక్సర్, ఆరు సార్లు ప్రపంచ చాంపియన్ మేరీకోమ్ గాయం కారణంగా ఈ మెగాటోర్నీకి దూరమైంది.
65 దేశాలకు చెందిన బాక్సర్లు పాల్గొననున్న ఈ చాంపియన్షిప్లో భారత్ నుంచి 12 మంది బరిలోకి దిగుతున్నారు. 11 రోజుల పాటు జరుగనున్న మెగాటోర్నీ మొత్తం ప్రైజ్ మనీ రూ. 20 కోట్లుగా ప్రకటించారు. మొత్తం 12 విభాగాల్లో పోటీలు జరుగనుండగా.. ఒక్కో విభాగంలో స్వర్ణ పతక విజేతకు రూ. 82 లక్షలు, రజత విజేతకు రూ. 41 లక్షలు, కాంస్య విజేతకు రూ. 20 లక్షల నగదు బహుమతి అందించనున్నారు. బుధవారం ప్రారంభ వేడుకలు ఘనంగా జరుగగా.. కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఐబీఏ అధ్యక్షుడు ఉమర్ క్రెమ్లెవ్, బీఎఫ్ఐ అధ్యక్షుడు అజయ్సింగ్, మేరీకోమ్, ఫర్హాన్ అక్తర్ తదితరులు పాల్గొన్నారు. తొలి రోజు ‘డ్రా’ విడుదల చేయగా.. భారత బాక్సర్లు లవ్లీనా, సవీటి బూరకు ‘బై’ లభించింది. లైట్ వెయిట్ (48 కేజీలు- 50 కేజీలు) విభాగంలో నిఖత్ జరీన్ గురువారం బరిలోకి దిగనుంది. తన బరువు కేటగిరీ మార్చుకున్న తర్వాత పోటీపడుతున్న రెండో టోర్నీలో నిఖత్ తొలి బౌట్లో అజార్బైజాన్కు చెందిన ఇస్మాయిలోవా అనకీనమ్తో తలపడుతుంది. టర్కీ వేదికగా గతేడాది జరిగిన ప్రపంచ టోర్నీలో పసిడి పతకంతో చరిత్ర సృష్టించిన నిఖత్ జరీన్ మరోమారు అలాంటి ప్రదర్శన చేయాలని పట్టుదలతో ఉంది. అయితే కీలకమైన సెమీస్, ఫైనల్స్లో రియో ఒలింపిక్స్ కాంస్య విజేత ఇంగ్రిట్ వాలెన్సియా (కొలంబియా), సుకిమి నమీకి (జపాన్) నిఖత్కు ఎదురయ్యే అవకాశముంది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Pawan Kalyan | రోజుకు 2 కోట్లు.. వైరల్గా మారిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్
Junior NTR | ఎంత పని చేశావు తారక్.. ఫ్యాన్ వార్ కు పెట్రోల్ పోసాడుగా..!
Oscars 2023 | ఆస్కార్ అవార్డు పోగొట్టుకుంటే ఎలా? అప్పుడు అకాడమీ ఏం చేస్తుంది?
Silicon Valley Bank | 100 రూపాయలకే సిలికాన్ వ్యాలీ బ్యాంకు యూకే యూనిట్ దక్కించుకున్న హెచ్ఎస్బీసీ