IND vs AUS | టైమ్ 2 న్యూస్, విశాఖపట్నం: సమిష్టి ప్రదర్శనతో ‘బోర్డర్-గవాస్కర్’ సిరీస్ చేజిక్కించుకున్న టీమిండియా.. ఇప్పుడు వన్డే సిరీస్ను కూడా ఒడిసి పట్టేందుకు రెడీ అయింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి వన్డేలో నెగ్గి ఫుల్ జోష్లో ఉన్న భారత్.. ఆదివారం వైజాగ్లో ఆస్ట్రేలియాతో రెండో మ్యాచ్ ఆడనుంది. వ్యక్తిగత కారణాల వల్ల తొలి మ్యాచ్కు దూరమైన రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి బరిలో దిగనున్నాడు.
ఈ ఏడాది ఆఖర్లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో ఈ సిరీస్ను రిహార్సల్స్గా భావిస్తున్న ఆస్ట్రేలియా.. వాంఖడే మ్యాచ్లో మంచి ప్రదర్శనే చేసినా.. కీలక సమయాల్లో పట్టు చేజార్చి పరాజయం వైపు నిలిచింది. గత మ్యాచ్లో స్వల్ప లక్ష్యఛేదనలో టాపార్డర్ విఫలమైనా.. హార్దిక్, జడేజాతో కలిసి రాహుల్ మ్యాచ్ను ముగించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో పెద్దగా ఆకట్టుకోలేక జట్టులో చోటు కోల్పోయిన రాహుల్.. తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్తోనే సమాధానమిచ్చాడు. రోహిత్ రాకతో ఇషాన్కు ఉద్వాసన తప్పకపోవచ్చు. గిల్తో కలిసి రోహిత్ ఓపెనింగ్ చేయనుండగా.. విరాట్ మూడో స్థానంలో బ్యాటింగ్కు రానున్నాడు.
గత మ్యాచ్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన కోహ్లీ.. తెలుగు ప్రేక్షకుల సమక్షంలో భారీ ఇన్నింగ్స్ ఆడుతాడా చూడాలి. తనకు అచ్చొచ్చిన మైదానంలో కోహ్లీ శతక్కొట్టాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. తొలి వన్డేలో గోల్డెన్ డక్గా వెనుదిరిగిన సూర్యకుమార్ యాదవ్పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక రాహుల్, పాండ్యా, జడేజాతో మిడిలార్డర్ బలంగా కనిపిస్తున్నది. సిరాజ్, శార్దూల్తో కలిసి షమీ పేస్ భారాన్ని మోయనుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్కు చోటు ఖాయమే. మరోవైపు గాయం నుంచి పూర్తిగా కోలుకోని వార్నర్.. ఈ మ్యాచ్లో బరిలోకి దిగుతాడా చూడాలి. గత వన్డేలో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన మార్ష్తో పాటు స్మిత్, లబుషేన్, హెడ్, గ్రీన్, మ్యాక్స్వెల్, స్టొయినిస్ కలిసికట్టుగా రాణిస్తే.. ఆసీస్ను ఆపడం కష్టమే.
మ్యాచ్ సాగేనా..
రెండో వన్డే కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. మ్యాచ్కు వర్షం అడ్డుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా విశాఖలో చిరుజల్లులు కురుస్తుండగా.. ఆదివారం మ్యాచ్ రోజు కూడా వరుణుడు పలకరించే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర వెల్లడించింది. ఇక విశాఖ పిచ్ బ్యాటింగ్కు స్వర్గధామం కాగా.. చివరిసారిగా ఇక్కడ జరిగిన వన్డేలో వెస్టిండీస్పై టీమిండియా 5 వికెట్లకు 387 పరుగులు చేసింది. రోహిత్, రాహుల్ సెంచరీలు బాదారు. వైజాగ్ వేదికగా టీమిండియా ఇప్పటి వరకు తొమ్మిది వన్డేలు ఆడగా.. అందులో ఏడింట విజయం సాధించింది. ఒక మ్యాచ్లో ఓడగా.. ఒకటి ‘టై’గా ముగిసింది. 118, 117, 99, 65, 157*, 0.. ఈ వేదికపై కోహ్లీ ఆడిన ఆరు వన్డేల్లో చేసిన స్కోర్లివి. విశాఖ పిచ్ అంటేనే పూనకం వచ్చినట్లు ఊగిపోయే విరాట్.. ఈసారి ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Allu Arjun | అల్లు అర్జున్ ట్విట్టర్లో నన్ను బ్లాక్ చేశాడు.. వైరల్గా మారిన వరుడు హీరోయిన్ ట్వీట్
Viral News | డంప్ యార్డులో అగ్ని ప్రమాదం.. రూ.100 కోట్ల ఫైన్ వేసిన ఎన్జీటీ
Naveen Murder Case | నవీన్ మర్డర్ కేసులో కీలక మలుపు.. జైలు నుంచి నిహారిక విడుదల