Passport | పాస్పోర్టు కావాలంటే ఇప్పుడు ఎక్కువ రోజులు ఎదురుచూడాల్సిన పనిలేదు. ఆన్లైన్ ప్రక్రియ వచ్చిన తర్వాత అప్లై చేసిన 15 రోజుల్లోనే పాస్పోర్టు ఇంటికి వచ్చేస్తోంది. ఇప్పుడు ఈ ప్రక్రియ మరింత సులభతరం అయ్యింది. 15 రోజులు కూడా ఎదురుచూడాల్సిన పని లేకుండా కేవలం ఐదు రోజుల్లోనే పాస్పోర్టు పొందవచ్చు. ఈ విషయాన్ని తాజాగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు.
దేశ రాజధాని ఢిల్లీలో నివసిస్తున్న ప్రజలు పాస్పోర్టు వెరిఫికేషన్ కోసం గతంలో మాదిరిగా 15 రోజుల వెయిటింగ్ టైమ్ ఉండదని.. కేవలం ఐదు రోజుల్లోనే ఈ వెరిఫికేషన్ పూర్తవుతుందని అమిత్ షా తెలిపారు. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ల ద్వారా పాస్పోర్టు వెరిఫికేషన్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. పాస్ పోర్టుల కోసం రోజుకు సగటున 2 వేల దరఖాస్తులు వస్తున్నాయని తెలిపారు. వీటిని ఆన్లైన్లో ప్రాసెస్ చేయడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తగ్గుతాయని పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసుల 76వ రైజింగ్ డే పరేడ్లో అమిత్ షా ఈ విషయాలను వెల్లడించారు. పోలీసు వెరిఫికేషన్ ప్రక్రియను బలోపేతం చేస్తామనీ, పాస్పోర్ట్ జారీ గడువును 10 రోజులు తగ్గిస్తామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఢిల్లీ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం అధికారిక పత్రికా ప్రకటనలో తెలిపింది.