Hairsh Rao | రాజకీయంగా కొట్లాడటం చేతగాక దిక్కుమాలిన రాజకీయాలకు బీజేపీ పాల్పడుతోందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. పట్టపగలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దొరికిపోయారని అన్నారు. పదో తరగతి పేపర్ లీకేజీ వెనుక సూత్రధారి బండి సంజయేనని ఆరోపించారు. మెదక్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితాలతో బీజేపీ చెలగాటం ఆడుతోందని ఆరోపించారు. పదో తరగతి పిల్లలతో క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు.
బీజేపీ నాయకులకు చదువు విలువ తెలియదని.. రాష్ట్రం నుంచి కేంద్రం దాకా వీళ్లవి ఫేక్ సర్టిఫికెట్లేనని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. మొన్న తాండూర్లో తెలుగు పేపర్ లీకైనా.. నిన్న వరంగల్లో హిందీ పేపర్ లీకైనా దాని వెనుక బండి సంజయ్ ఉన్నాడని అర్థమవుతోందని చెప్పారు. తాండూర్లో ప్రశ్నపత్రం లీకీజే వెనుక ఉన్న ఉపాధ్యాయుడు బీజేపీ ఉపాధ్యాయ సంఘానికి చెందిన వాడని.. నిన్న అరెస్టయిన ప్రశాంత్ బీజేపీ కార్యకర్త అని.. బండి సంజయ్కు ముఖ్య అనుచరుడు అని తెలిపారు. పేపర్ లీకైందని నిన్న మధ్యాహ్నం వరంగల్ జిల్లా అధ్యక్షురాలు పద్మ, బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్ ధర్నా చేశారని.. సాయంత్రం ఏమో అరెస్టు చేసిన ప్రశాంత్ను విడుదల చేయాలని ధర్నా చేశారని అన్నారు. ప్రశాంత్ బీజేపీ కార్యకర్త కాకపోతే ఎందుకు ధర్నా చేశారని మంత్రి ప్రశ్నించారు.
బీజేపీ నేతలే పథకం ప్రకారం లీకేజీలకు పాల్పడుతూ.. దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ రాజకీయంగా తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. బీజేపీ అంటేనే ఒక విద్వేషం, విచ్చిన్నం చేసే కుట్ర అని ఆరోపించారు. రాజకీయాల కోసం, అధికారం కోసం బీజేపీ నేతలు ఏదైనా చేస్తారని అర్థమవుతుందని అన్నారు. ఇదంతా విద్యార్థులు గమనిస్తున్నారని అన్నారు. దీన్ని తిప్పికొట్టాలని.. బీజేపీ నేతలకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
Follow Us : Google News, Facebook, Twitter