Bandi Sanjay | బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. మంగళవారం అర్ధరాత్రి కరీంనగర్లోని తన నివాసానికి వెళ్లిన పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసలు ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పకుండా పోలీసులు ఆయన్ను తీసుకెళ్లడంతో బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పరీక్షల వ్యవస్థను దెబ్బతీసేలా బండి సంజయ్ కుట్ర చేస్తున్నారని.. అందుకే ముందస్తుగా అరెస్టు చేశామని పోలీసులు ప్రకటించారు. బండి సంజయ్పై రెండు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. పదో తరగతి పరీక్ష పేపర్లు లీకేజీకి కుట్ర చేశారనే అభియోగంతో ఆయనపై ఈ కేసులు నమోదయ్యాయి. ఒక కేసు కరీంనగర్ 2 టౌన్లో నమోదవ్వగా.. మరో కేసు వరంగల్లోని కమలాపూర్లో నమోదు చేశారు. అర్ధరాత్రి 12 :15 గంటలకు బండి సంజయ్పై కేసు నమోదు చేసినట్లు వరంగల్ సీపీ రంగనాథ్ వెల్లడించారు.
టెన్త్ తెలుగు, హిందీ క్వశ్చన్ పేపర్స్ లీకేజీ, వాట్సాప్లో ప్రచారం వెనుక బండి సంజయ్ పాత్ర ఉందని పోలీసులు నిర్ధారించారు. ఈ క్రమంలో ఆయన్ను కుట్రదారుడిగా పేర్కొంటూ పలు కేసుల కింద కేసులు నమోదు చేశారు. బండి సంజయ్పై 420, 120 (బి), సెక్షన్ 5 ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. సీఆర్పీసీ 154, 157 కింద కూడా కేసులు నమోదయ్యాయి.
ఎంపీ బండి సంజయ్ వల్ల మొత్తం పరీక్షల నిర్వహణ ఇబ్బందిగా మారుతుందని.. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దీనిపై ఆధారపడి ఉందని ఆ ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు విఘాతం కలగకుండా ఉండేందుకే బండి సంజయ్ను ప్రివెన్షన్ అరెస్టు చేశామని ఎఫ్ఐఆర్ కాపీలో తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరులో తెలుగు పేపర్, కమలాపూర్లో హిందీ పేపర్ లీకేజీలపై కూడా బండి సంజయ్ నోట్స్ ఇచ్చారని ఎఫ్ఐఆర్లో తెలిపారు. విద్యార్థులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా కూడా ప్రవర్తించారని పేర్కొన్నారు.
హిందీ పేపర్ లీకేజీకి బాధ్యుడైన ప్రశాంత్తో బండి సంజయ్ చాటింగ్ చేశాడా? లేదా? అనే అంశంపై పోలీసులు దృష్టి సారించారు. ప్రశాంత్ రెండు గంటల్లో 142 కాల్స్ మాట్లాడినట్లు గుర్తించగా.. అందులో బండి సంజయ్కు కూడా కాల్స్ చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. వాట్సాప్లో బండి సంజయ్కు పేపర్ పంపిన తర్వాత కూడా మళ్లీ మాట్లాడినట్లు తెలుస్తోంది.
Follow Us : Google News, Facebook, Twitter