Somesh Kumar | టైం2న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్కు హైకోర్టు షాకిచ్చింది. క్యాడర్ వివాదంపై కీలక తీర్పు వెలువరించింది. తెలంగాణకు సీఎస్ సోమేశ్ కుమార్ కేటాయింపును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఏపీ క్యాడర్కు వెళ్లాలని సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది.
రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం సోమేశ్ కుమార్ను ఆంధ్రప్రదేశ్కు కేటాయించింది. కేంద్రం ఉత్తర్వులు నిలిపివేయాలని సోమేశ్ కుమార్ కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ( క్యాట్ )ను ఆశ్రయించారు. దీంతో తెలంగాణలోనే సోమేశ్ కుమార్ కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో సోమేశ్ కుమార్ తెలంగాణలో కొనసాగుతున్నారు. క్యాట్ ఉత్తర్వులను కొట్టివేయాలని 2017లో హైకోర్టును కేంద్రం ఆశ్రయించింది.
దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం క్యాట్ మధ్యంతర ఉత్తర్వులను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. 3 వారాల సమయం ఇవ్వాలన్న సోమేశ్ కుమార్ తరఫు న్యాయవాది అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. తీర్పు కాపీ చేతికందగానే ఏపీకి వెళ్లిపోవాలని ఆదేశించింది. కాగా, హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సోమేశ్ కుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిసింది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More: