CM KCR | అడవుల నరికివేత, పోడు భూముల దురాక్రమణ సమస్యకు ముగింపు పలకాలని నిర్ణయించినట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. అందుకే గిరిజనులు, ఆదివాసీలు సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వనున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. పట్టాలు ఇవ్వడమే కాకుండా ఆ భూములకు రైతుబంధు ఇస్తామని తెలిపారు. భూములు లేని గిరిజనులకు గిరిజన బంధు కూడా ఇస్తామని శుభవార్త చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో మాట్లాడిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ మేరకు ప్రకటన చేశారు.
పోడు భూములు దురాక్రమణే అని తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో అభిప్రాయపడ్డారు. గుత్తికోయలు చాలా ఆటవికంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. అటవీ అధికారి శ్రీనివాసరావును చంపేయడం కరెక్టేనా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. గుత్తికోయల గూండాగిరి మంచిది కాదని.. గిరిజనులు కంట్రోల్లోనే ఉండాలని సూచించారు. ప్రభుత్వ అధికారులపై దాడులకు దిగితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. అటవీ సరిహద్దులు పెట్టి సాయుధ దళాలతో పహారా కాస్తమని వెల్లడించారు.
పోడుభూముల సమస్య న్యాయపరమైన డిమాండ్ కాదని ఆయన అన్నారు. కానీ ఇదేవిధంగా కొనసాగడం కరెక్ట్ కాదని.. దీనికి ముగింపు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే ప్రస్తుతం గిరిజనులు, ఆదివాసీలు సాగు చేసుకుంటున్న 11 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇస్తామని ప్రకటించారు. కానీ ఇకపై పట్టాలు ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఈ నెలలోనే పోడు భూముల పంపిణీ చేస్తామని తెలిపారు. మళ్లీ అటవీ భూముల్ని నరకమని సంతకాలు తీసుకున్నాకే ఈ పట్టాలు ఇస్తామని చెప్పారు. ఒకవేళ మళ్లీ అటవీ భూముల్ని ధ్వంసం చేస్తే పట్టాలు వెనక్కి తీసుకుంటామని హెచ్చరించారు. ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదని తెలిపారు. పట్టాలు తీసుకున్న గిరిజనులకు రైతుబంధు కూడా ఇస్తామని తెలిపారు. భూములు లేని గిరిజనులకు గిరిజన బంధు ఇచ్చి ఆదుకుంటామని స్పష్టం చేశారు.
Follow Us : Google News, Facebook, Twitter