Mohammed Siraj | టైమ్ 2 న్యూస్, బెంగళూరు: అనతి కాలంలోనే భారత ప్రధాన పేసర్గా ఎదిగిన హైదరాబాదీ స్టార్ మహమ్మద్ సిరాజ్ తన మనసులోని బాధ పంచుకున్నాడు. కొవిడ్ కష్ట కాలంలో ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న సమయంలో తన తండ్రి చనిపోయిన విషయాన్ని మరోసారి గుర్తు చేసుకున్నాడు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో తన మానసిక స్థితి ఎలా ఉండేదో వివరించాడు.
బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్లో చక్కటి ప్రదర్శన కనబర్చిన సిరాజ్ను.. చివరి టెస్టు నుంచి విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం కానుండటంతో సిరాజ్కు తగినంత రెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆసీస్తో వన్డే సిరీస్ అనంతరం ఐపీఎల్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లీగ్లో సిరాజ్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పోడ్కాస్ట్లో అతడు ప్రత్యేకంగా ముచ్చటించాడు. 2020లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాప్తి చెందుతుండటంతో ‘బోర్డర్-గవాస్కర్’ సిరీస్ను బయోబబుల్లో నిర్వహించగా.. అప్పుడు జట్టులో యువ పేసర్గా చోటు దక్కించుకున్న సిరాజ్ తండ్రి మృతి చెందినా.. స్వదేశానికి తిరిగి రాలేకపోయాడు.
కన్నీళ్లను ఆపడం కష్టం
తండ్రి అంత్యక్రియల్లో కూడా పాల్గొనలేకపోయినందుకు తన గదిలో కూర్చొని ఒంటరిగా ఏడ్చేవాడినని సిరాజ్ తాజాగా పేర్కొన్నాడు. ‘కొవిడ్ నిబంధనల కారణంగా జట్టు ఆటగాళ్లు కూడా ఒకరితో ఒకరు కలుసుకునేవాళ్లు కాదు. అలాంటి సమయంలో అందరం వీడియో కాల్స్ ద్వారానే మాట్లాడుకునేవాళ్లం. ఆర్. శ్రీధర్ (అప్పటి టీమిండియా ఫీల్డింగ్ కోచ్) తరచూ ఫోన్ చేసి ఎలా ఉన్నావు, తిన్నావా అని అడిగేవాడు. నా కాబోయే భార్య కూడా నన్ను ఓదార్చేందుకు ప్రయత్నించేది. అయితే ఫోన్లో వాళ్ల ముందు ఎప్పుడు ఏడ్చేవాడిని కాదు. రూమ్ లో ఒంటరిగా ఉన్నప్పుడు దుఖః బాగా ఎక్కువయ్యేది. కన్నీళ్లను ఆపడం చాలా కష్టమయ్యేది. మా నాన్న చనిపోయిన మరుసటి రోజు ట్రైనింగ్ సెషన్లో పాల్గొన్నా.. ఆ సమయంలో అప్పటి హెడ్ కోచ్ రవిశాస్త్రి నాలో ధైర్యం నింపాడు.
‘‘మీ నాన్న ఆశీస్సులు నీ వెన్నంటే ఉంటాయి. ఈ సిరీస్లో నువ్వు తప్పక ఐదు వికెట్ల ప్రదర్శన చేస్తావు’’ అని అన్నాడు. అతడి మాటలు నిజమయ్యాయి. బ్రిస్బేన్ టెస్టులో ఐదు వికెట్లు సాధించా. అప్పుడు రవిశాస్త్రి ఆ విషయాన్ని గుర్తు చేశాడు’ అని సిరాజ్ పొడ్కాస్ట్లో పేర్కొన్నాడు. ఇక తన తండ్రితో గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్న సిరాజ్.. భావోద్వేగానికి గురయ్యాడు. తనని గొప్ప క్రికెటర్గా చూడాలని తండ్రి అహర్నిశలు కోరుకునేవాడని పేర్కొన్నాడు. ఇక ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లో చక్కటి ప్రదర్శనలు చేసిన సిరాజ్.. ఈ ఏడాది ఆఖర్లో భారత్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్లోనూ కీలకమవుతాడని కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్న విషయం తెలిసిందే.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Khusboo | నా కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించేవాడు.. తన బాధను వెల్లగక్కిన ఖుష్బూ
Amitabh Bachchan | ప్రభాస్ ప్రాజెక్ట్ కే షూటింగ్లో అపశ్రుతి.. అమితాబ్ బచ్చన్కు గాయాలు
Balakrishna | బాలయ్య కూడా అదే చేయబోతున్నాడా.. ఆహా కోసం మరో ముందడుగు..!