Janhvi Kapoor | హమ్మయ్యా ! ఎట్టకేలకు ఎన్నో రోజుల నిరీక్షణకు తెరపడింది. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీ కన్ఫార్మ్ అయిపోయింది. ఎన్టీఆర్ హీరోగా వస్తున్న NTR30 సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి అడుగుపెడుతుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అఫిషియల్గా కన్ఫార్మ్ చేసింది. ఈ మేరకు జాన్వీకపూర్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసింది.
ఎన్టీఆర్ 30 మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లో లంగావోణిలో అచ్చ తెలుగమ్మాయిలా కనిపిస్తోంది. ఈ పోస్టర్లో పెద్ద కొండ పక్క నుంచి అలలు ఎగిసిపడుతుంటే నీటి ఒడ్డున కూర్చొని మత్తెక్కించే చూపులతో జాన్వీ చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ పోస్టర్లో జాన్వీ కపూర్ను చూసి కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. టాలీవుడ్ స్క్రీన్పై జాన్వీకపూర్ను చూడాలని ఉవ్విళ్లూరిపోతున్నారు. ఇక ఈ సినిమా కోసం జాన్వీ కపూర్ భారీగానే డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. తెలుగులో జాన్వీకి ఇదే తొలి చిత్రం అయినా రూ.5 కోట్ల పారితోషికం డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్లో చెప్పుకోదగ్గ హిట్స్ ఏవీ లేకపోయినప్పటికీ.. తెలుగులో ఈమెకు ఉన్న క్రేజ్ను చూసి జాన్వీ అడిగినంత ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
సముద్రం నేపథ్యంలో వస్తున్న ఎన్టీఆర్30 సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా చిత్రీకరణ ఫిబ్రవరి 24న ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ పలు కారణాల వల్ల వాయిదా పడింది. నందమూరి తారకరత్న మరణంతో ఈ సినిమా షూటింగ్కు ఎన్టీఆర్ కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు మార్చి 12న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఉండటంతో ఈ ఈవెంట్ కోసం అమెరికా వెళ్తున్నాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత అంటే మార్చి 18న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.