Medical Student Preethi | ర్యాగింగ్ భూతానికి పీజీ వైద్య విద్యార్థిని బలైంది. సీనియర్ సైఫ్ వేధింపులు భరించలేక అనస్థేషియా ఓవర్ డీస్ తీసుకున్న వరంగల్ కేజీఎం వైద్య విద్యార్థిని ప్రీతి.. ఐదురోజుల పాటు ప్రాణాలతో పోరాడి కన్నుమూసింది. ఆరోగ్యం క్షీణించడంతో ప్రీతి ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచినట్లు నిమ్స్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ప్రీతి మరణంతో నిమ్స్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి.
ప్రీతి మరణ వార్త తెలియగానే ఆమె కుటుంబానికి న్యాయం జరగాలని గిరిజన, ప్రజాసంఘాలు నిమ్స్ ఆస్పత్రికి చేరుకుని ఆందోళనకు దిగాయి. ప్రీతి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా ప్రీతి తండ్రి, ప్రజా సంఘాల నేతలు అడ్డుకున్నారు. దీంతో ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు ప్రీతి మరణానికి కారణమైన సైఫ్ను శిక్షించాలని ప్రీతి స్వగ్రామమైన జనగామ జిల్లా కొడగండ్ల మండలం గిర్నితండాలో గ్రామస్థులు ఆందోళనకు దిగారు.
నా కూతురు మరణానికి కారణం చెప్పాలి… ప్రీతి తండ్రి
తన కూతురుది ఆత్మహత్య కాదని ప్రీతి తండ్రి సంచలన ఆరోపణలు చేశారు. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? సూసైడ్ కాదని అంటున్నారు.. దీనిపై కమిటీ వేయాలని.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపల్, హెచ్వోడీలను సస్పెండ్ చేయాలని అన్నారు. ప్రీతి మరణానికి కారణాలు చెబితేనే డెడ్ బాడీని తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇస్తేనే ఆస్పత్రి నుంచి వెళ్తామని లేదంటే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటానని ప్రీతి తండ్రి ఆందోళన వ్యక్తం చేశాడు.
ప్రీతిది సూసైడ్ కాదు.. ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్
ప్రీతిది సూసైడ్ కాదని.. ఆమె మరణంపై కట్టుకథలు అల్లుతున్నారని తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు రమేశ్ ఆరోపించారు. మృతురాలు అనస్థీషియా తీసుకున్నారనేది అవాస్తవమని అన్నారు. తెర వెనుక ఉండి ఎవరో రాసిచ్చిన స్ట్రిప్టును డాక్టర్లు అమలు చేస్తున్నారని తెలిపారు. దీనిపై సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ప్రీతి కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా
ప్రీతి మఈతి మరణం బాధాకరమని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని తెలంగాణ ప్రభుత్వం, మంత్రులు హామీ ఇచ్చారు. ప్రీతి కుటుంబానికి సీఎం కేసీఆర్ రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. దోషులు ఎంతటి వారైనా శిక్షిస్తామని అన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. ప్రీతి మరణంపై మంత్రి హరీశ్ రావు సంతాపం తెలిపారు. ఆమె మృతి అత్యంత బాధాకరమని.. ప్రీతి ఆరోగ్యంగా వస్తుందని ఆశించాం.. ఆమె కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అని తెలిపారు. ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Medical Student Preethi | సీనియర్లంతా ఒక్కటయ్యారు అమ్మా.. ఆత్మహత్యకు ముందు ఫోన్ చేసి బాధపడ్డ ప్రీతి
Triangle Love Story | నవీన్ హత్యలో నిహారికనే సూత్రధారి.. హరిహర కృష్ణ తండ్రి సంచలన ఆరోపణలు