Turkey Earthquake | తుర్కియే, సిరియా దేశాలపై భూకంపం విలయతాండవం చేసింది. ఈ ప్రకృతి వైపరీత్యానికి 21 వేల మందికి పైగా మరణించారు. వాతావరణం అనుకూలించకపోయినప్పటికీ సహాయక చర్యలు ఆగడం లేదు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ పెద్ద సంఖ్యలో మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే సోమవారం తెల్లవారుజామున సంభవించిన అత్యంత శక్తిమంతమైన భూకంపం ధాటికి ఆ దేశాలు ఉన్న టెక్టోనిక్ ప్లేట్లు సుమారు ఐదు నుంచి ఆరు మీటర్ల పక్కకు కదిలినట్లు ఇటలీకి చెందిన సీస్మాలజిస్ట్ ప్రొఫెసర్ కార్లో డగ్లియాని తెలిపారు.
తుర్కియే ఉన్న టెక్టోనిక్ ప్లేట్స్ మధ్య రాపిడి కారణంగా ఈ కదలిక జరిగినట్లు వెల్లడించారు. తమ అంచనా ప్రకారం… ఈ భూకంప తీవ్రతతో సిరియాతో పోలిస్తే తుర్కియే 5-6 మీటర్లు పక్కకు జరిగిందని తెలిపారు. టర్కీ భూభాగం కింద ఉన్న అనటోలియా, అరేబియా, యూరోషియా, ఆఫ్రికా భూఫలకాలు నిరంతరం ఒకదానితో ఒకటి ఢీకొనడంతో 7.8, 7.2 తీవ్రతతో వరుసగా రెండు సార్లు శక్తిమంతమైన భూకంపాలు సంభించినట్లు ఆయన తెలిపారు.
తాజాగా సంభవించిన భూకంపం తుర్కియే కిందనే ఉన్న తూర్పు అనటోలియన్ ఫాల్ట్ ప్రాంతంలో చోటుచేసుకుంది. గతంలోనూ ఇదే ఫలకం రాపిడికి గురై ఇక్కడ భూకంపాలు సంభవించాయి. ఇక, తాజా భూకంప కేంద్రం.. నేల నుంచి 18 కి.మీ లోతులోనే ఉంది. అందువల్లే పెను విధ్వంసాన్ని మిగిల్చింది. భూకంప కేంద్రం లోతు ఎంత ఎక్కువగా ఉంటే.. నష్టం అంత తక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
Follow Us : Google News, Facebook, Twitter