Turkey Earthquake | తుర్కియే, సిరియా దేశాలు ప్రకృతి విలయానికి అల్లకల్లోలంగా మారాయి. వరుస భూకంపాలకు రెండు దేశాలు వణికిపోయాయి. భూ ప్రకంపనల కారణంగా ఇరు దేశాల్లోని భవనాలు క్షణాల్లో కుప్పకూలిపోయాయి. శిథిలాల కింద నలిగి వేలాది మంది మరణించారు. ఇప్పటివరకు 3800 మరణించినట్టు అధికారికంగా ప్రకటించినప్పటికీ.. 10 వేలమంది వరకు మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే అంచనా వేస్తుంది. ఇప్పటికీ వేలాది మంది చిక్కుకుని ఉండటంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంతటి విలయాన్ని చూసిన తుర్కియే దేశాధ్యక్షుడు రీసెస్ తాయిప్ ఎర్దోవాన్.. 1939 తర్వాత ఇదే అత్యంత తీవ్రమైన భూకంపం అని అన్నారు. అప్పట్లో తూర్పు టర్కీలోని ఎర్జిన్కన్లో వచ్చిన భూకంపం కారణంగా 33వేల మంది చనిపోయారు. ఆ తర్వాత 1999లో వాయువ్య టర్కీలో భూకంప కారణంగా 17వేల మందికిపైగా మృత్యువాత పడ్డారు. మరి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అదిపెద్ద భూకంపాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1950…అస్సాం:
తొమ్మిదో అతిపెద్ద భూకంపం 1950 లో అస్సాం, టిబెట్ సరిహద్దుల్లో చోటు చేసుకుంది. 1960 మే 22న చిలీలో రిక్టర్ స్కేల్పై 9.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రకృతి విపత్తులో 6000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఒకేరోజు, క్షణాల్లోనే, ఒకే దేశంలో ఈ సంఖ్యలో మరణించడం అప్పట్లో పెద్ద సంచలనం అయ్యింది.
చిలీ ( 1960)
చిలీలోని బయో బయో ప్రాంతంలో 1960 మే 22న భారీ భూకంపం సంభవించింది. 9.5 తీవ్రతతో దాదాపు 10 నిమిషాల పాటు భూమి కంపించింది. సముద్రంలో 25 మీటర్ల ఎత్తున రాకాసి అలలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రకృతి విలయానికి దాదాపు 6 వేల మంది మరణించారు. ఇప్పటివరకు అత్యంత తీవ్రతతో వచ్చిన భూకంపాల్లో ఇదే అతి పెద్దది కావడం గమనార్హం.
అలాస్కా ( 1964 )
ఇప్పటివరకు అత్యంత తీవ్రతతో వచ్చిన భూకంపాల్లో 1964 మార్చిలో అలస్కాలో వచ్చినది రెండోది. 9.2 మ్యాగ్నిట్యూడ్తో 4.38 నిమిషాల పాటు భూమి కంపించింది. ఈ భూకంపం కారణంగా చాలా చోట్ల భూమి చీలిపోయింది. చాలావరకు భవనాలు కుప్పకూలాయి. ఈ విపత్తులో 250 మంది ప్రాణాలు కోల్పోయారు.
సుమత్ర ( 2004 )
తీవ్రతపరంగా మూడో అతిపెద్ద భూకంపం 2004 డిసెంబర్ 26న వచ్చింది. హిందూ మహాసముద్రంలో 9.1 తీవ్రతతో వచ్చిన ఈ విపత్తు సునామీగా ఇప్పటికీ అందరికీ గుర్తుండిపోయింది. సుమత్ర, ఇండోనేసియా దేశాల్లో కేంద్రంగా పుట్టిన ఈ భూకంపం కారణంగా వచ్చిన రాకాసి అలలు 14 దేశాల్లో సుమారు 2,30,000 మందిని పొట్టనబెట్టుకుంది. భారత భూభాగంలోని టెక్టోనిక్ ప్లేట్లు, బర్మా భూభాగానికి చెందిన టెక్టోనిక్క్ ప్లేట్లతో రాపిడి చెందడం వల్ల సముద్రగర్భంలో భారీ భూకంపాలు ఏర్పడ్డాయి. దీని ఫలితంగా సముద్రపు అలలు సుమారు 30 మీటర్ల ఎత్తు వరకు ఎగిరి పడి తీర ప్రాంతాలను ముంచి వేశాయి. ఈ విపత్తు వల్ల ఇండోనేషియా తీవ్రంగా నష్టపోయింది. శ్రీలంక, భారతదేశం, థాయ్ లాండ్ దేశాలు కూడా ఈ భూకంపం ధాటికి నష్టపోయాయి. ప్రపంచలోనే అత్యంత ఘోరవిపత్తుల్లో ఒకటిగా నిలిచిపోయింది.
జపాన్ ( 2011)
సిస్మోగ్రాఫ్ మీద రికార్డయిన నాలుగో అతిపెద్ద భూకంపం 2011లో జపాన్లో వచ్చింది. తూర్పు ద్వీపకల్పంలోని ఒషికాకు 70 కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేలుపై 9.1 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. దీని భూకంప కేంద్రం 24 కిలోమీటర్ల లోతులోనే ఉంది. దీని ప్రభావంతో 40 మీటర్ల ఎత్తులో సునామీ అలలు విరుచుకుపడ్డాయి. దాదాపు 20 నిమిషాల తర్వాత సునామీ అలలు ఉత్తరాన హక్కైడో, దక్షిణాన ఒకినావా దీవులను తాకాయి. దీని ప్రభావంతో 15 వేల మందికిపైగా మరణించారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. జపాన్ చరిత్రలో ఇదే అత్యంత భూకంపం.
రష్యా (1952 )
1952లో రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో వచ్చిన భూకంపం.. అత్యధిక తీవ్రతతో వచ్చిన భూకంపాల్లో ఐదోవదిగా నిలిచింది. 9 తీవ్రతతో భారీ భూకంపం రావడం కారణంగా 18 మీటర్ల ఎత్తులో మూడు సునామీ అలలు పుట్టుకొచ్చాయి. మొదట సెవరే – కురిల్స్క్ ప్రాంతంపై ఇవి ప్రభావం చూపించాయి. మొదటి సునామీ అల వచ్చిన సమయయంలో దగ్గరలోని కొండపైకి వెళ్లి ప్రాణాలను రక్షించుకున్నారు. ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకుంటూ వీళ్లు కిందకు దిగిరాగానే రెండో సునామీ అల విరుచుకుపడింది. దీంతో ఆ ప్రాంతంలో నివసించే 6వేల మందిలో 2336 మంది మరణించారు. అంటే ఆ ప్రాంత జనాభాలో మూడో వంతు ప్రాణాలు కోల్పోయారు.
నేపాల్ ( 2015 )
2015 ఏప్రిల్ 25న నేపాల్లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. లమ్జంగ్కు ఆగ్నేయ దిశగా దాదాపు 34 కిలోమీటర్ల దూరంలో భూమికి 15 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నెలకొంది. దీని ప్రభావంతో నేపాల్తో పాటు భారత్, చైనా, బంగ్లాదేశ్లో కూడా ప్రకంపనలు వచ్చాయి. దీంతో 8300 మంది ప్రాణాలు కోల్పోయారు.
గుజరాత్ (2001)
భారత్లో వచ్చిన భారీ విపత్తుల్లో 2001లో గుజరాత్లో వచ్చిన భూకంపం ఒకటి. జనవరి 26న ఉదయం 7.7 తీవ్రతతో రెండు నిమిషాల పాటు భూమి కంపించింది. గుజరాత్లోని కచ్ జిల్లా బచావు తాలుకాలోని చోబరి గ్రామంలో దీని భూకంప కేంద్రం ఉంది. పాకిస్థాన్లోని పలు ప్రాంతాల్లో కూడా దీని ప్రకంపనలు వచ్చాయి. ఈ భూకంప ధాటికి సుమారు 20వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 1,67వేల మంది తీవ్రంగా గాయపడ్డారు. 3 లక్షల 40వేల బిల్డింగ్లు నేలమట్టమయ్యాయి.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Turkey Earthquake | ప్రకృతి ప్రకోపానికి 3800 మంది బలి.. చిగురుటాకులా వణికిపోతున్న తుర్కియే, సిరియా
BRS MLAs Poaching Case | ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు!
Telangana Budget | సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే రూ.3లక్షలు.. తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్