Sikkim Accident | సిక్కింలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి 16 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర సిక్కింలోని జెమా ప్రాంతంలో జవాన్లతో వెళ్తున్న ఆర్మీ ట్రక్కు మూల మలుపు వద్ద అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది జవాన్లు, ముగ్గురు ఆర్మీ అధికారులు మృతి చెందారు. మరో నలుగురు జవాన్లకు గాయాలయ్యాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ జవాన్లను హెలికాప్టర్లలో అస్పత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది.
సిక్కింలోని చాటేన్ నుంచి థంగూలోని బోర్డర్ పోస్టులకు మూడు వాహనాలతో ఆర్మీ కాన్వాయ్ వెళ్తుండగా జెమా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో ట్రక్కులో 20 మంది జవాన్లు, ముగ్గురు అధికారులు ఉన్నారు. దాదాపు వంద అడుగల పైనుంచి లోయలో ట్రక్కు పడిపోవడంతో తునాతునకలైంది. జవాన్ల మృతిపై రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వీర జవాన్ల మరణంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సైనికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్న ప్రధాని మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రమాదం గురించి తెలుసుకొని విచారం వ్యక్తం చేశారు. గాయపడ్డ జవాన్లకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ప్రమాదంపై స్పందించారు. అమర జవాన్ల సేవలకు దేశం రుణపడి ఉంటుందన్నారు.
Read More Articles |
Omicron BF.7 Symptoms | చైనాను వణికిస్తున్న ఒమిక్రాన్ కొత్త వేరియంట్ BF.7 లక్షణాలివే..