Harish Rao | మాకు మేము స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుంటే తప్పా బీఆర్ఎస్కు తిరుగుండదని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామా యాత్ర ఐదో విడత ముగింపు సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బీఆర్ఎస్ పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శించారు. బీఆర్ఎస్కు ఇక వీఆర్ఎస్ అంటూ వ్యాఖ్యానించాడు. దీనిపై హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్కు వీఆర్ఎస్ అంటే మాకు ఓటమి లేదని ఒప్పుకున్నట్లేనా అంటూ నడ్డాపై ధ్వజమెత్తారు.
ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును నడ్డా గుడ్డిగా చదివారంటూ హరీశ్రావు విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం హామీలు అమలు చేయడం లేదని నడ్డా విమర్శించడంపై హరీశ్రావు మండిపడ్డారు. అసలు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఏ హామీ నిలబెట్టుకుందని ప్రశ్నించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి ? 15 లక్షల రూపాయలు ఖాతాలో వేస్తామన్న హామీ ఏమైంది? నల్లధనం తీసుకొస్తామన్నారు ఏమైంది? రూపాయి విలువ పెంచుతామని చెప్పారు.. పెంచారా? రైతుల ఆదాయం రెట్టింపైందా? కోట్ల ఉద్యోగాలంటిరి ఏవి? అంటూ నడ్డాను ఎదురు ప్రశ్నించారు.
రైతుల ఆదాయం రెట్టింపు చేయడం సంగతి పక్కనపెడితే.. బీజేపీ సర్కారు డీజీల్, ఎరువుల ధరలు పెంచి రైతుల పెట్టుబడిని రెట్టింపు చేసిందంటూ విమర్శించారు. తెలంగాణలో మేనిఫెస్టోలో చెప్పినవే కాకుండా.. సామాన్యులకు అవసరమైన పథకాలను అమలు చేసిన నాయకుడు కేసీఆర్ అని స్పష్టం చేశారు. మిషన్ భగీరథను మేనిఫెస్టోలో చెప్పలేదు.. కళ్యాణలక్ష్మి పథకం అమలు చేస్తామనలేదు.. రైతుబంధు ఇస్తామని చెప్పలేదు.. రైతు బీమా కూడా ఎన్నికల హామీ కాదు.. కేసీఆర్ కిట్ గురించి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలేదు కానీ ప్రజల కోసం అమలు చేశామని హరీశ్ రావు చెప్పారు.
ఎన్నికల్లో ఎలా గెలవాలి.. ఎవరిపై కేసులు పెట్టాలన్న ఆలోచనే..
పేదింటి ఆడబిడ్డలకు, తల్లులకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతోనే అన్ని వర్గాలకు కళ్యాణలక్ష్మి పథకం అమలు చేశామని హరీశ్రావు స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రతి ఎకరానికి రైతు బంధు ఇచ్చామని, రైతులను దృష్టిలో పెట్టుకుని రైతు బీమా కూడా అమలు చేశామన్నారు. గతంలో రైతులు మరణిస్తే కనీసం పరిహారం కూడా ఇవ్వలేదన్నారు. గర్భస్రావాలు, శిశు మరణాలు, తల్లి మరణాలు తగ్గించేందుకు కేసీఆర్ కిట్ అమలు చేశామని, అద్భుత ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. బీజేపీ ఎప్పుడూ సామాన్యుల గురించి ఆలోచించలేదని విమర్శించారు. ఎంతసేపు రాజకీయాలు చేయాలి.. ఎన్నికల్లో ఎలా గెలవాలి.. ఎవరిపై కేసులు పెట్టాలన్న తపనే తప్ప బీజేపీ ప్రజలకు చేసిందేం లేదన్నారు.
తెలంగాణలో బీజేపీని నమ్మే పరిస్థితి లేదు..
తెలంగాణలో బీజేపీని నమ్మే పరిస్థితి లేదని హరీశ్ అన్నారు. కేంద్రం కంటే తెలంగాణ చాలా ముందన్నదని అన్నారు. తెలంగాణ పథకాలను కేంద్రమే కాపీ కొడుతోందని విమర్శించారు. తెలంగాణ పథకాలు బాగోలేకుంటే కేంద్రం అవార్డులు ఎందుకు ఇస్తోందని ప్రశ్నించారు. తెలంగాణకు అవార్డులు రాని రంగం, విభాగం లేదన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి రానన్ని అవార్డులు తెలంగాణకు వస్తున్నాయన్న అక్కసుతో భవిష్యత్తులో అవార్డులను బీజేపీ రద్దు చేస్తదన్న అనుమానం వస్తుందని హరీశ్రావు అన్నారు.
Read More Articles |
BRS Party | ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసును ప్రారంభించిన కేసీఆర్.. హాజరైన అఖిలేష్ యాదవ్, కుమారస్వామి