Kane Williamson | టైమ్ 2 న్యూస్, వెల్లింగ్టన్: ప్రపంచలోనే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడైన న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మరో ఘనత తన పేరిట లిఖించుకున్నాడు. ప్రస్తుత తరంలో ఫ్యాబ్-4గా గుర్తింపు తెచ్చుకున్న ‘కోహ్లీ, స్మిత్, విలియమ్సన్, రూట్’లో ఒకడైన కేన్.. క్రికెట్ పుస్తకాల్లోని షాట్లను అచ్చుగుద్దినట్లు దించేయడంలో మొనగాడని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పరిస్థితులు కఠినంగా ఉన్న సమయంలోనే తన విలువ చాటుకునే విలియమ్సన్ ఇంగ్లండ్తో రెండో టెస్టులో మరో మేలిముత్యం లాంటి ఇన్నింగ్స్తో అలరించాడు. ఫాలోఆన్లో బరిలోకి దిగి అద్వితీయమైన ఆటతీరుతో శతక్కొట్టిన విలియమ్సన్ టెస్టు క్రికెట్లో 26వ సెంచరీ తన పేరిటి లిఖించుకున్నాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ చరిత్రకెక్కాడు. వెల్లింగ్టన్ రెండో ఇన్నింగ్స్లో 132 పరుగులు చేసిన విలియమ్సన్ రాస్ టేలర్ (7683)ను దాటి.. అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. ప్రస్తుతం కేన్ ఖాతాలో 7787 పరుగులు ఉన్నాయి. ఈ జాబితాలో టేలర్ రెండో స్థానానికి చేరగా.. స్టీఫెన్ ఫ్లెమింగ్ (7172), బ్రెండన్ మెక్కల్లమ్ (6453), మార్టిన్ క్రో (5444) టాప్-5లో చోటు దక్కించుకున్నారు. రాస్ టేలర్ 196 ఇన్నింగ్స్ల్లో ఈ పరుగులు చేయగా.. విలియమ్సన్ 161 ఇన్నింగ్స్ల్లోనూ అతడిని దాటేయడం విశేషం.
ఇప్పటికే ఇంగ్లండ్ చేతిలో తొలి టెస్టు ఓడి పీకల్లోతు కష్టాల్లో మునిగి ఉన్న న్యూజిలాండ్.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే చివరి నిమిషాల్లో తమ కెప్టెన్ టిమ్ సౌథీ కనబర్చిన పోరాటాన్ని ఆదర్శంగా తీసుకున్న కివీస్.. రెండో ఇన్నింగ్స్లో దంచికొట్టింది. 2001 కోల్కతా టెస్టులో ఫాలోఆన్ నుంచి ఉత్తుంగతరంగంలా ఎగిసిన గంగూలీ సేనను తలపిస్తూ.. న్యూజిలాండ్ రెచ్చిపోయింది. మొదట ఇంగ్లండ్ 435/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.. బదులుగా న్యూజిలాండ్ 209 రన్స్కు ఆలౌటైంది. దీంతో ఆతిథ్య జట్టును మరింత ఒత్తిడిలోకి నెట్టాలని భావించిన ఇంగ్లిష్ టీమ్.. న్యూజిలాండ్ను ఫాలోఆన్ ఆడించింది. ఈ సారి పట్టుదల కనబర్చిన కివీస్ రెండో ఇన్నింగ్స్లో 483 పరుగుల భారీ స్కోరు చేసింది. ఫాలోఆన్ ఆడుతూ కివీస్ గొప్ప పోరాటం కనబర్చింది. మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (282 బంతుల్లో 132; 12 ఫోర్లు) సూపర్ సెంచరీతో చెలరేగగా.. బ్లండెల్ (90), టామ్ లాథమ్ (83), కాన్వే (61), మిషెల్ (54) హాఫ్సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో లీచ్ 5 వికెట్లు పడగొట్టారు. అనంతరం 258 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. సోమవారం నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. చేతిలో 9 వికెట్లు ఉన్న ఇంగ్లిష్ జట్టు.. విజయానికి ఇంకా 210 పరుగులు చేయాల్సి ఉంది. డకెట్ (23), రాబిన్సన్ (1) క్రీజులో ఉన్నారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Isle of Man Record | 10 పరుగులకే ఆలౌట్.. అంతర్జాతీయ మ్యాచ్లో చెత్త రికార్డు..
WT20 World Cup 2023 | విశ్వవిజేతగా ఆస్ట్రేలియా.. ఆరోసారి మహిళల టీ20 ప్రపంచకప్ కైవసం
Medical Student Preethi | సీనియర్లంతా ఒక్కటయ్యారు అమ్మా.. ఆత్మహత్యకు ముందు ఫోన్ చేసి బాధపడ్డ ప్రీతి
Triangle Love Story | నవీన్ హత్యలో నిహారికనే సూత్రధారి.. హరిహర కృష్ణ తండ్రి సంచలన ఆరోపణలు