T20 world cup | చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై విజయంతో భారత్లో ఒకరోజు ముందుగానే దీపావళి సంబురాలు మొదలయ్యాయి. చివరి బంతి వరకూ నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన మ్యాచ్లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది.
టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ను ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 159 పరగులు చేసింది. షాన్ మసూద్ 52 పరుగులు, ఇఫ్తికార్ అహ్మద్ 51 పరుగుల చేయడంతో పాక్ భారీ స్కోర్ చేయగలిగింది. చివర్లో షహీన్ షా ఆఫ్రిది 16 పరుగులు చేశాడు. ఈ ముగ్గురు మినహ అందరూ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ 3, అక్షర్ పటేల్ 3, భువనేశ్వర్, షమీ చెరో వికెట్ తీశారు.
160 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన భారత్కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ నాలుగు పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత రాహుల్ కూడా నాలుగు పరుగులకే పెవిలియన్ చేరాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన సూర్యకుమార్ యాదవ్ చక్కటి షాట్లతో అలరించాడు. కానీ ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. 15 పరుగులకే ఔటయ్యాడు. అటు అక్షర్ పటేల్ కూడా రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ అవడంతో భారత్ 34 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ దశలో హార్ధిక్ పాండ్యాతో కలిసి విరాట్ కోహ్లీ మ్యాచ్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఆచితూచి ఆడుతూ పాక్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించారు. పాక్ బౌలర్లు చెలరేగడంతో ఒక దశలో 10 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 45 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే క్రీజులో కుదురుకున్న అనంతరం కోహ్లీ, పాండ్యా చెలరేగిపోయారు. 12 ఓవర్లో కోహ్లీ ఒక సిక్స్, పాండ్యా రెండు సిక్స్లు బాదారు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్కు 113 పరుగుల భాగస్వామ్యం జోడించారు. కోహ్లీ చివరి వరకు క్రీజులో ఉండి భారత్ను విజయతీరాలకు చేర్చాడు. కోహ్లీ 53 బంతుల్లో 6 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 82 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. పాండ్యా 37 బంతుల్లో ఒక ఫోర్ , రెండు సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. పాక్ బౌలర్లలో రవుఫ్, నవాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
చివరి మూడు ఓవర్లలో ఏం జరిగిందంటే..
చివరి 18 బంతుల్లో భారత్ విజయానికి 48 పరుగులు అవసరమయ్యాయి. దీంతో పాక్ గెలుపు ఖాయమనుకున్నారు. కానీ.. కోహ్లీ తన మార్క్ చూపించి మ్యాచ్ను మలుపుతిప్పాడు. 18వ ఓవర్లో మూడు ఫోర్లు బాదడంతో 17 పరుగులు వచ్చాయి. చివరి రెండు ఓవర్లకు 31 పరుగులు చేయాల్సిన పరిస్థితి. 19 ఓవర్ చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి.. భారత శిబిరంలో ఆశలు చిగురింపజేశాడు. చివరి ఓవర్లో 15 పరుగులు అవసరమయ్యాయి.
- అలాంటి పరిస్థితిలో చివరి ఓవర్ తొలి బంతికి పాండ్యా ఔటయ్యాడు.
- రెండో బంతికి కార్తీక్ సింగిల్ తీసి కోహ్లీకి స్ట్రైక్ ఇచ్చాడు.
- మూడో బంతికి రెండు పరుగులు వచ్చాయి.
- నాలుగో బంతిని కోహ్లీ సిక్సర్గా మలిచాడు. అది నోబాల్ కావడంతో భారత్కు ఫ్రీ హిట్ వచ్చింది. దాన్ని వైడ్గా వేయడంతో.. మూడు పరుగులు తీశాడు. మొత్తంగా నాలుగు పరుగులు వచ్చాయి.
- చివరి రెండు బంతుల్లో రెండు పరుగులు అవసరమయ్యాయి. అయితే ఐదో బంతికి దినేశ్ కార్తీక్ స్టంపౌటయ్యాడు. భారత్ ఓటమి తప్పదు అనుకుంటుండగా.. ఆరో బంతిని నవాజ్ వైడ్ వేశాడు. దీంతో స్కోర్ సమమైంది. చివరి బంతికి అశ్విన్ సింగిల్ తీయడంతో భారత్ విజయం సాధించింది.
రికార్డుల మోత..
టీ20లో చివరి బంతికి భారత్ విజయం సాధించడం ఇది నాలుగో సారి. అంతకుముందు 2016లో ఆస్ట్రేలియాపై, 2018లో బంగ్లాదేశ్, వెస్టిండీస్పై చివరి బంతికి భారత్ విజయం సాధించింది.
Read more articles |
Hallmark Gold | మీ బంగారు ఆభరణాలపై ఉన్న హాల్ మార్క్ అసలుదా.. నకిలీదా గుర్తించడం ఎలా?
vaasthu tips | వాస్తు ప్రకారం కిచెన్ ఏ దిక్కున ఉండాలి? ఎందుకు?