TSRTC | జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సామాన్యులకు కూడా భారంగా మారింది. టోల్ ఛార్జీలను 5 శాతం పెంచడంతో పెరిగిన కొత్త ధరలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో తమపై పడుతున్న అదనపు భారాన్ని ప్రయాణికులపై వేసేందుకు టీఎస్ఆర్టీసీ సిద్ధమైంది.
ఏప్రిల్ 1వ తేదీ నుంచి టోల్ ప్లాజా నుంచి వెళ్లే బస్సులు ఇప్పటివరకు చెల్లిస్తున్న రుసుము కంటే అదనంగా 5 శాతం చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఈ 5 శాతం అదనపు రుసుమును ప్రయాణికులపై వేయాలని టీఎస్ఆర్టీసీ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం ఒక్కో టికెట్పై టోల్ ఛార్జీ కింద రూ.4 అదనంగా పెంచాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకు ఆర్డినరీ పల్లె వెలుగు నుంచి గరుడ ప్లస్ వరకు అన్ని బస్సుల్లోనూ ఒకే విధంగా టికెట్పై రూ.4 పెంచింది. ఇటీవల ప్రవేశపెట్టిన నాన్ ఏసీ స్లీపర్ బస్సులో రూ.15, ఏసీ స్లీపర్లో రూ.20 టోల్ ఛార్జీ వసూలు చేయనున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచే ఈ కొత్త చార్జీలు అమల్లోకి వచ్చాయి. టోల్ ప్లాజా నుంచి వెళ్లే బస్సుల్లో మాత్రమే ఈ పెంపు వర్తిస్తుంది.