School girl missing | మేడ్చల్ జిల్లా జవహర్నగర్లో కనిపించకుండా పోయిన నాలుగో తరగతి చదువుతున్న బాలిక మిస్సింగ్ విషాదాంతమైంది. గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లి కనిపించకుండా పోయిన ఇందు (10) మృతదేహాన్ని దమ్మాయిగూడ చెరువులో పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద రీతిలో మృతి చెందిన బాలిక మృతదేహాన్నిపోస్టుమార్టం కోసం పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాలిక మృతితో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
అసలేం జరిగింది..
జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్కు చెందిన ఇందు.. దమ్మాయిగూడ ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. గురువారం ఉదయం బాలికను ఆమె తండ్రి నరేశ్ పాఠశాల వద్ద విడిచిపెట్టారు. అయితే ఆ తర్వాత బాలిక కనిపించకుండా పోయింది. దీంతో పాఠశాల సిబ్బంది పేరెంట్స్కి సమాచారం అందించారు. కంగారుపడిన తల్లిదండ్రులు సమీప ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అయితే సీసీ కెమెరాలో ఓ చోట బాలిక వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. వాటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా వెతకగా.. శుక్రవారం ఉదయం దమ్మాయిగూడలోని అంబేడ్కర్ చెరువులో బాలిక మృతదేహాం కనిపించింది.
కాగా, బాలిక చెరువు దగ్గరకు ఎలా వెళ్లిందనేదానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలికతో మరెవరైనా వెళ్లారా అనే దిశగా పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. బాలిక మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక తల్లిదండ్రులు మాత్రం బాలికను ఎవరో కిడ్నాప్ చేశారని ఆరోపిస్తున్నారు. పోలీసులు నిర్లక్ష్యం చేయడం వల్లే తమ కూతురు మరణించిందని బాలిక తల్లిదండ్రులు, బంధువులు దమ్మాయిగూడ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. పోలీసులు, పాఠశాల సిబ్బంది తీరుపై మండిపడ్డారు.
Read More Articles |
Top 10 south Indian actress | ఈ ఏడాది గూగుల్లో అత్యధికంగా వెతికింది ఈ హీరోయిన్ గురించే..
Hallmark Gold | మీ బంగారు ఆభరణాలపై ఉన్న హాల్ మార్క్ అసలుదా.. నకిలీదా గుర్తించడం ఎలా?