Medical Student Preethi | సీనియర్ల వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి ప్రయత్నించిన వరంగల్ కేఎంసీ పీజీ మెడికల్ స్టూడెంట్ ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ కూడా విషమంగానే ఉంది. ప్రస్తుతం ఆమెకు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా ఆమెకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తుండగా.. శరీరంలోని అనేక అవయవాలు పనిచేయడం మానేసినట్లు డాక్టర్లు చెబుతున్నారు. కానీ ఆమె ఆరోగ్య పరిస్థితి పై ఇప్పుడే ఏం చెప్పలేమని వైద్యులు తెలిపారు. దీని గురించి ఆమె తండ్రి నరేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిమ్స్ ఆసుపత్రిలో తన కుమార్తెకు ఇక్కడ సరైన వైద్యం అందట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆరోగ్యం పై డాక్టర్లు ఎలాంటి సమాచారం అందిచటం లేదని తెలిపారు.
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోనే సరైన వైద్యం అందించారని..ఇక్కడ ఎవరూ పట్టించుకోవటం లేదని వాపోయారు. అక్కడ గొడవ జరిగితే..తమ ఆసుపత్రి పరువు పోతుందనే భయంతో నిమ్స్ కు తరలించాలని అన్నారు. ఆర్పీఎఫ్లో పని చేసే తాను..ఆత్మహత్యలకు యత్నించిన ఎంతో మందికి కౌన్సిలింగ్ ఇచ్చి వారి జీవితాల పై ఆశలు చిగురించేలా చేశానని..చివరకు తన కూతురుకి ఇలాంటి గతి పడుతుందని అసలు అనుకోలేదని నరేందర్ కన్నీటి పర్యంతమయ్యారు.
తన కుమార్తెను వేధింపులకు గురి చేస్తున్నారని.. ఇంతకు ముందే స్థానిక పోలీసులకు ఫోన్ చేసి చెప్పినా వారు సరిగా పట్టించుకోలేదని ఆరోపించారు. స్థానిక ఎస్సైకు, ఏసీపీకి కూడా కంప్లైంట్ చేశానని అన్నారు. వారు సకాలంలో స్పందించి ఉంటే ఈ రోజు తన కూతురి పరిస్థితి ఇలా ఉండేది కాదని అన్నారు.
తన కూతురు ఆత్మహత్యాయత్నానికి కారణమైన హెచ్వోడీ, సీనియర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. సరైన వైద్యం అందించి తన కుమార్తెను కాపాడాలని.. ఉద్యోగం పోయినా ఫర్వాలేదని అన్నారు. తాను బతికితే చాలని.. బిచ్చమెత్తుకుని అయినా పోషించుకుంటానని కన్నీళ్లు పెట్టున్నారు.