Kodali Nani | వంగవీటి మోహన రంగా చావుకు కారణమైన నేతలు టీడీపీలోనే ఉన్నారంటూ ఏపీ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగా హత్యలో చంద్రబాబు, టీడీపీ నేతల హస్తం ఉందంటూ ఆరోపించారు. రంగా హత్య కేసులో దేవినేని ఉమ, వెలగపూడి రామకృష్ణ ముద్దాయిలుగా ఉన్నారని నాని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. తాను టీడీపీలో ఉన్నప్పుడు వంగవీటి రాధాను కలిస్తే చంద్రబాబు సీరియస్ అయ్యాడన్నారు. ఇప్పుడు అదే తెలుగు దేశం పార్టీ ఆయన కోసం పాకులాడుతోందంటూ విమర్శించారు.
గుడివాడలో వంగవీటి రంగా 34వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొడాలి నాని హాజరై చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కొడాలి నాని.. వంగవీటి రంగా కుటుంబంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తు చేశారు. వంగవీటి రాధా మా కుటుంబసభ్యుడని, పార్టీలకు అతీతంగా రాధాతో ప్రయాణం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తాను మరణించే వరకు రంగా ఆశయాలను కొనసాగిస్తానని చెప్పారు.
తనకు రక్షణ లేదని రంగా వేడుకున్నా ఆనాడు అధికారంలో ఉన్న తెలుగు దేశం ప్రభుత్వం పట్టించుకోలేదని నాని అన్నారు. రంగాను వ్యక్తులు కాదు వ్యవస్థ చంపిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. రంగా హత్యకు తెలుగు దేశం పార్టీనే కారణమని, రాజకీయంగా రంగాను ఎదుర్కోలేకే చంపేశారన్నారు. రంగా పేరు చెప్పుకోకుండా రాజకీయం చేయలేని దుస్థితి టీడీపీదని, ఆయన ఎదుగుదలను ఓర్వలేక తొక్కేయాలని చూశారని అన్నారు. అది సాధ్యం కాకపోవడంతోనే చంపేశారంటూ మండిపడ్డారు.
మేం ఎవరి బూట్లు నాకేవాళ్లం కాదు..
గుడివాడ ఓటర్లే తమ భవిష్యత్తుని నిర్ధేశిస్తారని నాని అన్నారు. తనను ఓడించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలన్నీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిందని.. ఇష్టం అయితేనే ఓట్లు వేయండి లేదంటే పీకి పడేయండి అంటూ జగనే స్వయంగా చెబుతున్నారని గుర్తు చేశారు. తమకు ఏ పార్టీతో పొత్తు అక్కర్లేదని, మేం ఎవరి బూట్లూ నాకే వాళ్లం కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధ్యతతో లేకుంటే ఓడిపోతామన్న భయం నాకు, జగన్కు ఉందన్న నాని.. భయం ఉంది కాబట్టే బాధ్యతగా పనిచేస్తూ విజయం సాధిస్తున్నామని స్పష్టం చేశారు.