Manish Sisodia | లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ విచారణకు ముందు హాజరు కావడానికి ముందు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సంచలన ట్వీట్ చేశారు. తాను భగత్ సింగ్ అనుచరుడిని అని.. ఇప్పుడే కాదు మరో ఏడెనిమిది నెలలు జైల్లో ఉండాల్సి వచ్చినా భయడపడేది లేదని ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ ఆదివారం ఆయనను విచారించనుంది. ఈ క్రమంలో సీబీఐ కార్యాలయానికి వెళ్లేముందు మనీశ్ సిసోడియా రాజ్ ఘాట్ కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. సిసోడియా తన ఇంటి నుంచి బయలుదేరగానే పెద్ద సంఖ్యలో ఆప్ కార్యకర్తలు ఆయన వెంట వాహనాల్లో సాగుతూ.. ప్లకార్డులు చూపుతూ.. నినాదాలు చేశారు. ఓ రోడ్ షో మాదిరి సిసోడియా కాన్వాయ్ సాగింది. ఈ క్రమంలో సిసోడియాను అరెస్టు చేయవచ్చని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. తమలో పలువురిని ఇప్పటికే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అంటే ప్రధాని మోదీకి భయమని, అందుకే తనను తప్పుడు కేసులో ఇరికించారని అంతకుముందు మనీశ్ సిసోడియా ఆరోపించారు. మొదటి నుంచి తనకు అండగా ఉన్న తన భార్య అనారోగ్యంతో ఇంట్లో ఒంటరిగా ఉందని, ఆమె బాగోగులను చూసుకోవాలని పార్టీ కార్యకర్తలను కోరుతున్నానని ఆయన తెలిపారు. ఇక కేజ్రీవాల్ ట్వీట్ చేస్తూ.. ‘మనీశ్.. భగవంతుడు నీ వైపే ఉన్నాడు.. లక్షలాది పిల్లలు, వారి తలిదండ్రుల ఆశీస్సులు మీకున్నాయని పేర్కొన్నారు. ఇది శాపం కాదని, గొప్ప విజయావకాశమని అన్నారు. జైలు నుంచి మీరు త్వరలోనే రిలీజ్ కాగలరని ఆశిస్తున్నాను అని ఆయన అన్నారు.