Corona Cases | టైం2న్యూస్, హైదరాబాద్: చైనా తరహాలో భారత్లో కరోనా కేసులు పెరిగే అవకాశం లేదని ఏఐజీ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. మరణాలు కూడా ఆ స్థాయిలో సంభవించే అవకాశాలు లేవని అంచనా వేశారు. అయితే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చైనాలో వినియోగిస్తున్న టీకాలు నాసికరమైనవని అందుకే కరోనాను అడ్డుకోలేకపోతున్నాయని, ఫలితంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని అన్నారు. అదే భారత్లో తయారు చేసిన వ్యాక్సిన్లు వేర్వేరు పద్ధతుల్లో రూపొందించినవని, సమర్థవంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు. అంతేకాదు చైనాలో ఇప్పటివరకు ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకోలేదన్న నాగేశ్వర్ రెడ్డి.. భారత్లో ఇప్పటికే 85 శాతం మందికి పైగా రెండు డోసులు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు.
అయితే కరోనా వైరస్ను పూర్తిస్థాయిలో అడ్డుకోవడానికి బూస్టర్ డోసు బ్రహ్మస్త్రంగా పనిచేస్తుందని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. మొదటి రెండు డోసులు కోవాగ్జిన్ కేసుకుంటే బూస్టర్ డోసు కోవిషీల్డ్, మొదటి రెండు డోసులు కోవిషీల్డ్ వేసుకుంటే బూస్గర్ డోస్గా కోవాగ్జిన్ వేసుకోవాలని సూచించారు. కార్బివాక్స్ రెండు డోసులు తీసుకుంటే బూస్టర్ డోస్గా కోవాగ్జిన్, కోవిషీల్డ్ వేసుకోవచ్చన్నారు. ఇలా చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయన్నారు. ఏఐజీ ఆస్పత్రి నిర్వహించిన పరిశోధనా పత్రం తాజాగా వ్యాక్సిన్స్ అనే ప్రఖ్యాత పత్రికలో ప్రచురితమైంది. దీనిపై శుక్రవారం ఏఐజీలో నిర్వహించిన విలేకరుల సమవేశంలో నాగేశ్వర్ రెడ్డి పలు కీలక విషయాలు వెల్లడించారు.
చైనాలో ఇప్పడు రోజుకు కోట్లలో వెలుగు చూస్తున్న కరోనా కేసులు ఫిబ్రవరి నాటికి భారీగా పెరిగి.. మార్చిలో తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. భారత్లో వచ్చే రెండు నెలల్లో కేసులు పెరిగే ఛాన్స్ ఉందన్నారు. బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాస్కులు పెట్టుకోవడం ద్వారా కరోనాను అడ్డుకోవచ్చని, తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించారు. కరోనా ప్రభావం తగ్గే వరకు ఏటా బూస్టర్ డోసు తీసుకోవాలని సూచించారు. మూడేళ్ల తర్వాత కరోనా కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయని నాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. చైనాలో కరోనా విజృంభనకు కారణమైన ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7కు రెమ్డిసివిర్ ఔషధం బాగా పనిచేస్తుందన్నారు.
Read More Articles |
Worlds Largest outbreak | ఒక్కరోజే 3.7 కోట్ల కరోనా కేసులు.. చైనాలోకల్లోలం సృష్టిస్తున్న కరోనా
Bharat Biotech Nasal vaccine | కరోనా విలయతాండవం చేస్తున్న వేళ గుడ్న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం