Shiva linga puja | శివుడు.. సమస్త లోకాలకు ఆదిదేవుడు. భక్తిశ్రద్ధలతో భోళా శంకరుడిని పూజిస్తే కోరిన కోరికలను నెరవేరుస్తాడు. అందుకే పరమేశ్వరుడి అనుగ్రహం కోసం చాలామంది ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఇలా పూజించే సమయంలో చాలామంది తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. కొన్ని వస్తువులతో ముక్కంటిని పూజిస్తే పూజాఫలం దక్కకపోగా చిక్కులు ఎదురవుతుంటాయి. అందుకే శివలింగాన్ని పూజించడానికి ముందు ఏ వస్తువులు సమర్పించకూడదో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
హిందువులు పసుపు – కుంకుమను చాలా పవిత్రంగా భావిస్తారు. ఏ శుభకార్యం చేసినా ఇవి తప్పనిసరిగా ఉండాల్సిందే. కానీ వీటిని శివారాధనలో ఉపయోగించకూడదు. ముఖ్యంగా లింగ పూజకు వెళ్లినప్పుడు కుంకుమ, సింధూరం తీసుకెళ్లకూడదు. శివునికి తిలకం దిద్దితే అరిష్టమని పండితులు చెబుతుంటారు. అందుకే శివుడికి తిలకం దిద్దరు. ఇక పసుపు మహిళలకు సంబంధించినది. కానీ శివలింగం అంటే పురుష వ్యక్తిత్వం కాబట్టి పసుపును శివారాధనలో వినియోగించరు. ఒకవేళ పసుపుతో అర్చించిన ఎలాంటి ఫలితం ఉండదు.
హిందువులు తులసి చెట్టును దేవతగా పూజిస్తారు. కానీ శివునికి తులసి ఆకులను సమర్పించడం అశుభం. ఎందుకంటే తులసి శ్రీమహావిష్ణువుకి ప్రీతిపాత్రమైనది కాబట్టి శివారాధనలో తులసిని వినియోగించరు.
చాలామంది దేవుళ్లకు శంఖంతో అభిషేకం చేస్తుంటారు. కానీ శివ లింగానికి పూజ చేసేటప్పుడు మాత్రం శంఖంతో నీరందించకూడదు. శంఖచుడు అనే రాక్షసుడిని శివుడు సంహరించాడు. కాబట్టే శివలింగాన్ని శంఖంతో పూజించకూడదని చెబుతుంటారు.
పరమేశ్వరుడిని కొబ్బరికాయతో పూజించవచ్చు. శివలింగం ముందు టెంకాయ కొట్టవచ్చు. కానీ ఆ నీటిని సమర్పించకూడదని పండితులు చెబుతుంటారు. అలాగే ఎరుపు రంగు పూలతో ఎప్పుడూ కూడా శివుడిని అర్చించకూడదు. అలా చేస్తే పూజాఫలం రాదని విశ్వసిస్తుంటారు.
శివునికి తెలుపు వర్ణంలో ఉన్న పూలను మాత్రమే అర్పించాలి. అయితే కేతకీ పూలను పరమశివుడు శపించాడని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఆ పూలతో కూడా శివుడిని పూజించవద్దు. బిల్వపత్రి ఆకులతో పూజించాలి. ఇతర ఆకులతో అస్సలు పూజించకూడదు.
Read More Articles |
Lord Shiva | సోమవారం శివుడిని ఎందుకు పూజిస్తారు?
ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?
ఒక వ్యక్తి ఎన్ని ఏళ్లు కిరాయి ఉంటే ఆ ఇల్లు అతని సొంతమవుతుంది?