Lord Shiva | పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు సోమవారం. ఈ రోజున ఆ శివుడిని పూజిస్తే కష్టాల నుంచి గట్టెక్కిస్తాడని.. తమను అనుగ్రహిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ప్రతి సోమవారం ముక్కంటిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ విశ్వాసం వెనుక ఉన్న కారణమేంటి? అసలు సోమవారం అంటే ఈశ్వరుడికి ఎందుకంత ఇష్టం? అనే ప్రశ్నలకు పురాణాల్లో ఆసక్తికరమైన ఒక కథ ఉంది. అదేంటంటే..
దక్షరాజు తన 27 మంది దత్తపుత్రికలను చంద్రుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. చంద్రుడి ఈ 27 మంది భార్యలు 27 నక్షత్రాలను సూచిస్తారు. వీరిలో చంద్రుడికి రోహిణి అంటే ఎక్కువ ప్రేమ. అందుకే ఆమెతోనే వీలైనంత సమయం గడుపుతుంటాడు. మిగిలిన వారిని నిర్లక్ష్యం చేస్తుంటాడు. ఇలా రోజురోజుకీ తమను చంద్రుడు పట్టించుకోకపోవడంతో కోపోద్రేక్తులైన మిగిలిన భార్యలు.. దక్షుడి వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తారు. అప్పుడు దక్షుడు కలుగజేసుకుని చంద్రుడికి నచ్చజెబుతాడు. మిగిలినవారిని కూడా రోహిణితో సమానంగా చూడమని బతిమిలాడుతాడు. అయినా వినకపోవడంతో హెచ్చరిస్తాడు కూడా. ఎంతకీ చంద్రుడి ప్రవర్తనలో మార్పు రాదు. దీంతో ఆగ్రహానికి గురైన దక్షుడు.. చంద్రుడిని శపిస్తాడు.
దక్షుడి శాపం కారణంగా చంద్రుడు రోజురోజుకీ తన ప్రభను కోల్పోవడంతో పాటు పరిమాణంలో కూడా తగ్గిపోతుంటాడు. ఈ హఠాత్పరిణామంతో భయాందోళనకు గురైన చంద్రుడు వెంటే బ్రహ్మ దేవుడి వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటాడు. తనను రక్షించమని వేడుకుంటాడు. అప్పుడు ఆ మహాశివుడు మాత్రమే సాయం చేయగలడని ఆ బ్రహ్మ దేవుడు చెబుతాడు. బ్రహ్మ సూచన మేరకు పరమశివుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఆయన్ను ఆరాధించడం మొదలుపెడతాడు. ఎన్ని ఆటంకాలు కలిగిన వాటిని పట్టించుకోకుండా తన పూజను కొనసాగిస్తుంటాడు. చంద్రుడి భక్తికి మెచ్చి కటాక్షించిన దేవదేవుడు.. అతని ఎదుట ప్రత్యక్షం అవుతాడు. చంద్రుడు తిరిగి తన శక్తి పొందేలా అనుగ్రహిస్తాడు. కానీ అప్పటికే దక్షుడి శాపం కారణంగా ప్రభను కోల్పోయి ఉండటంతో.. ప్రతి మాసంలో పదిహేను రోజులు క్రమంగా నశిస్తూ.. అమావాస్య నాటికి శక్తిని కోల్పోతాడని.. ఆ తర్వాత తిరిగి 15 రోజులు తన శక్తిని పుంజుకుంటాడని వారం ఇస్తాడు.
చంద్రుడిని సోముడు అని కూడా పిలుస్తారు. దక్షుడి శాపం నుంచి చంద్రుడిని రక్షించాడు కాబట్టి పరమేశ్వరుడిని చంద్రశేఖరుడు, సోమనాథుడు అని పిలుస్తారు. ఈ కారణంగానే సోమవారం అత్యంత భక్తిశ్రద్ధలతో శివుడిని పూజిస్తే కష్టాల నుంచి బయటపడేస్తాడని భక్తులు విశ్వసిస్తుంటారు.
Read More Articles |
ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?
ఒక వ్యక్తి ఎన్ని ఏళ్లు కిరాయి ఉంటే ఆ ఇల్లు అతని సొంతమవుతుంది?