Naveen Murder Case | తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థి నవీన్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హరిహరకృష్ణ ప్రియురాలు నిహారిక బెయిల్ వచ్చింది. ఈ కేసులో ఏ3గా ఉన్న నిహారికకు రంగారెడ్డి జిల్లా కోర్టు శనివారం బైలు మంజూరు చేసింది. దీంతో చర్లపల్లి జైలు నుంచి ఆమె విడుదలైంది. ప్రియురాలి కోసం ప్రాణ స్నేహితుడినే హరిహరకృష్ణ కిరాతకంగా చంపడం ఇటీవల సంచలనం సృష్టించింది. ప్రేమించిన అమ్మాయి దక్కదేమోనని నవీన్ను తల నరికి, గుండె చీల్చి, మర్మాంగాలను కోసేసి అత్యంత పాశవికంగా హరిహరకృష్ణ చంపేశాడు. అనంతరం సాక్ష్యాధారాలను మాయం చేయడంలో హరిహరకృష్ణకు మరో స్నేహితుడు హాసన్ సాయపడ్డాడు. దీంతో అతనిపై ఏ2గా కేసు పెట్టారు. హత్య విషయం తెలిసినా కూడా దాచిపెట్టినందుకు నిహారికపై ఏ3గా కేసు నమోదైంది. తాజాగా నిహారిక బెయిల్పై చర్లపల్లి జైలు నుంచి విడుదలైంది.
అసలేం జరిగింది?
హరిహరకృష్ణ ముసారాంబాగ్లో ఉంటూ దిల్సుఖ్ నగర్లోని ఓ కాలేజీలో ఇంటర్ చదివాడు. నవీన్ అక్కడే పరిచయమయ్యాడు. అదే సమయంలో నవీన్కు నిహారిక అనే అమ్మాయి పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారింది. ఇంటర్ అయిపోయిన తర్వాత నవీన్.. నార్కట్పల్లిలోని మహాత్మాగాంధీ వర్సిటీలో ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు. హరిహరకృష్ణ ఫిర్జాదిగూడలోని అరోరా కాలేజీలో చేరాడు. బీటెక్లో చేరిన తర్వాత నవీన్ వేరే అమ్మాయిలతో కూడా చనువుగా ఉండటం చూసి నిహారిక అతన్ని దూరం పెట్టింది. ఇదే అదునుగా హరిహరకృష్ణ ఆ అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. ఆమెతో సన్నిహితంగా ఉంటూ లవ్ ప్రపోజ్ కూడా చేశాడు. అలా 9 నెలలు గడిచిన తర్వాత వాళ్లిద్దరూ దగ్గరవ్వడం చూసి నవీన్ మళ్లీ అమ్మాయితో మాటలు కలిపాడు. తరచూ ఫోన్లో మాట్లాడటం మొదలుపెట్టాడు. దీంతో హరిహరకృష్ణలో అభ్రదతాభావం పెరిగిపోయింది. నవీన్ ఉంటే ఆ యువతి తనకు దక్కదని భావించాడు. దీంతో అతన్ని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.
మూడు నెలల కింద స్కెచ్
నవీన్ అడ్డు తొలగించుకోవాలని హరిహరకృష్ణ మూడు నెలల క్రితమే నిర్ణయించుకున్నాడు. రెండు నెలల క్రితం మలక్పేటలోని ఓ సూపర్ మార్కెట్లో కత్తి కూడా కొనుగోలు చేశాడు. వేలిముద్రలు దొరక్కుండా ఓ మెడికల్ షాపులో రెండు జతల గ్లౌజులు కొన్నాడు. అబ్దుల్లాపూర్మెట్ ఏరియాలో నవీన్ను హత్య చేయడానికి సరైన ప్లేస్ కోసం దాదాపు 8సార్లు రెక్కీ నిర్వహించాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేలా మంచి స్పాట్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఫిబ్రవరి 16న ఇంటర్ ఫ్రెండ్స్ గెట్ టు గెదర్ ఏర్పాటు చేసుకున్నారు. అదే రోజు నవీన్ను హత్య చేయాలని హరిహరకృష్ణ స్కెచ్ వేశాడు. కానీ ఆ రోజు నవీన్ రాకపోవడంతో తప్పించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు హరిహరకృష్ణకు నవీన్ ఫోన్ చేసి తనను కలవడానికి వస్తున్నా అని చెప్పాడు. ఇదే అదునుగా భావించి ముందు రోజు ఫెయిల్ అయిన ప్లాన్ను ఆ రోజు అమలు చేయాలని హరిహర కృష్ణ నిర్ణయించుకున్నాడు. 17వ తేదీన ఎల్బీనగర్లో నవీన్ దిగగానే అతన్ని తీసుకుని ముసారాంబాగ్లోని తన సోదరి ఇంటికి వెళ్లాడు. సాయంత్రం అయ్యాక తాను మళ్లీ యూనివర్సిటీ హాస్టల్కు వెళ్లిపోవాలని నవీన్ చెప్పాడు. అందుకు సరే అన్న హరిహరకృష్ణ తానే దింపుతానని అన్నాడు.
స్నేహితుడితో కలిసే..
గత నెల 17న సేనావత్ నవీన్ నాయక్ (22)ను నల్గొండలో విడిచిపెడతానని హరిహరకృష్ణ బైక్ ఎక్కించుకున్నాడు. అబ్దుల్లాపూర్మెట్ దగ్గర ఇద్దరూ కలిసి మద్యం తాగారు. అనంతరం ప్రేయసి నిహారిక గురించి మాట్లాడుకుంటూ రమాదేవి పబ్లిక్ స్కూల్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి నవీన్ను తీసుకెళ్లాడు. అక్కడే గొంతు నులిమి చంపేశాడు. అనంతరం పెద్ద కత్తితో గుండెను చీల్చడమే కాకుండా మొండెం నుంచి తలను వేరు చేశాడు. తన ప్రేయసిని తాకిన పెదాలు, చేతి వేళ్లతో పాటు మర్మాంగాన్ని కోసేశాడు. అనంతరం బ్రాహ్మణపల్లి జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో ఉంటున్న తన స్నేహితుడు హాసన్ ఇంటికి వెళ్లాడు. నవీన్ను హత్య చేశానని హాసన్కు చెప్పిన హరిహరకృష్ణ.. తనకు సాయం చేయాలని కోరారు. దీంతో నవీన్ మృతదేహం ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ముక్కలుగా చేసిన అవయవాలతో పాటు తలను ఒక బియ్యం సంచిలో కుక్కి మన్నెగూడ ప్రాంతంలో పడేశారు. అనంతరం ఇద్దరూ హాసన్ ఇంటికి వెళ్లారు. హరిహరకృష్ణ రాత్రి అక్కడే రెస్ట్ తీసుకున్నాడు.
హత్య చేసిన ప్లేస్కు నిహారిక
నవీన్ను హత్య చేసిన తర్వాత ఫొటోలను నిహారికకు హరిహరకృష్ణ వాట్సాప్లో పంపించాడు. కానీ ఆమె నమ్మలేదు. దీంతో మరుసటి రోజు ( గత నెల 18న ) ఉదయం హస్తినాపురంలోని క్రిస్టియన్ కాలనీలో ఉంటున్న నిహారిక దగ్గరకు వెళ్లి హరిహరకృష్ణ కలిశాడు. ఆమెకు ఫోన్ చేసి బయటకు పిలిపించాడు. నిజంగానే హత్య చేశానని నమ్మించి.. ఆమె దగ్గర ఖర్చుల కోసం రూ.1500 తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అప్పట్నుంచి వాళ్లిద్దరూ పలుమార్లు ఫోన్లో మాట్లాడుకున్నారు. 20వ తేదీన సాయంత్రం మళ్లీ నిహారికను హరిహరకృష్ణ కలుసుకున్నాడు. ఆమెను తన బైక్ ఎక్కించుకుని నవీన్ను హత్య చేసిన ప్రాంతానికి తీసుకెళ్లాడు. కొంచెం దూరం నుంచే ఆ ప్రాంతాన్ని చూపించి తిరిగొచ్చారు. తర్వాత స్థానికంగా ఉన్న ఒక రెస్టారెంట్లో భోజనం చేశారు. అక్కడి నుంచి హరిహరకృష్ణ వెళ్లిపోయాడు.
లొంగిపోయే ముందు నిహారిక ఇంటికి..
నవీన్ కనిపించడం లేదంటూ ఫోన్లు ఎక్కువ కావడంతో దొరికిపోతానేమో అని కంగారుపడ్డ హరిహరకృష్ణ పోలీసులకు లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. గత నెల 24న పోలీసులకు లొంగిపోయే ముందు సాక్ష్యాధారాలు అన్నింటినీ నాశనం చేయాలని ప్లాన్ చేశాడు. దీనికోసం మరోసారి హాసన్ సాయం తీసుకున్నాడు. తల, ముక్కలైన ఇతర అవయవాలను హాసన్ సేకరించి.. హరిహరకృష్ణకు అప్పగించాడు. వాటిని తీసుకున్న హరిహరకృష్ణ.. నవీన్ను హత్య చేసిన ప్రాంతానికి వెళ్లి కాల్చేశాడు. అనంతరం హాసన్ ఫోన్లోని కాల్ డేటా, మెసేజ్లు, వాట్సాప్ డేటా మొత్తం డిలీట్ చేశాడు. అదే రోజు సాయంత్రం నిహారిక ఇంటికి వెళ్లాడు. అక్కడే స్నానం చేసి.. ఆమె మొబైల్లోని డేటాను కూడా డిలీట్ చేసేశాడు. అనంతరం అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు.
సీన్ రీకన్స్ట్రక్చన్లో బయటపడ్డ ప్రియురాలి పాత్ర
కస్టడీలోకి తీసుకుని హరిహరకృష్ణను విచారిస్తే తానొక్కడే ఇదంతా చేసినట్లు ముందు నుంచి చెప్పుకొచ్చాడు. ఎక్కడా యువతి, తన స్నేహితుడి పాత్రను బయటపెట్టలేదు. అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ సమయంలో తడబడటంతో పోలీసులు అనుమానించి గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయాలను బయటపెట్టాడు. దీంతో హాసన్, నిహారికను సోమవారం నాడు పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారించారు. తొలుత తమకేమీ తెలియదని బుకాయించారు. కానీ పోలీసులు సాక్ష్యాధారాలు చూపించడంతో నిజం ఒప్పుకున్నారు. దీంతో వాళ్లిద్దరినీ కూడా నవీన్ హత్య కేసులో నిందితులుగా చేర్చారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Allu Arjun | అల్లు అర్జున్ ట్విట్టర్లో నన్ను బ్లాక్ చేశాడు.. వైరల్గా మారిన వరుడు హీరోయిన్ ట్వీట్
Viral News | డంప్ యార్డులో అగ్ని ప్రమాదం.. రూ.100 కోట్ల ఫైన్ వేసిన ఎన్జీటీ
Naveen Murder Case | నవీన్ మర్డర్ కేసులో కీలక మలుపు.. జైలు నుంచి నిహారిక విడుదల