Jamuna | టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. సీనియర్ హీరోయిన్ జమున (86) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఫిలిం ఛాంబర్కు ఆమె పార్థివ దేహాన్ని తీసుకురానున్నారు.
1936 ఆగస్టు 30 హంపీలో నిప్పణి శ్రీనివాసరావు, కౌసల్యాదేవి దంపతులకు జమున జన్మించారు. ఆమె అసలు పేరు జానాభాయి. సినిమాల్లోకి వచ్చే ముందు జ్యోతిష్యుల సూచనతో ఆమె తల్లిదండ్రులు జమునగా పేరు మార్చారు. తల్లి దగ్గరే సంగీతం, హార్మోనియం నేర్చుకున్న జమున ముందుగా నాటకాల్లోకి ప్రవేశించింది. ఖిల్జీరాజు పతనం నాటకంలోని ఓ పాత్రకు సీనియర్ నటుడు జగ్గయ్య ఆమెను సెలెక్ట్ చేశాడు. మా భూమి నాటకం చూసి డాక్టర్ గరికపాటి రాజారావు జమునకు తొలి అవకాశం ఇచ్చారు. అలా 1952లో పుట్టిల్లు సినిమాతో సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది. అప్పట్నుంచి దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్గా కొనసాగింది. ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, ఎస్వీ రంగారావు వంటి దిగ్గజ నటులతో కలిసి నటించింది. గుండమ్మ కథ, మిస్సమ్మ, ఇల్లరికం, ఇలవేల్పు, లేత మనసులు సహా సుమారు 200కి పైగా సినిమాల్లో నటించింది. ముఖ్యంగా పౌరాణిక సినిమాల్లో సత్యభామ క్యారెక్టర్ అంటే జముననే గుర్తొచ్చేది. 1964, 1968లో ఉత్తమ సహాయనటిగా ఫిలిం ఫేర్ అవార్డులు అందుకుంది. 2008లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం దక్కింది.
సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ జమున రాణించారు. 1989లో రాజమండ్రి నుంచి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 1991 ఎన్నికల్లో ఓడిపోవడంతో రాజకీయాలకు దూరమయ్యారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Balakrishna | అక్కినేని తొక్కినేని వ్యాఖ్యలపై స్పందించిన బాలకృష్ణ.. వివాదం సద్దుమణిగినట్టేనా?
Balakrishna | బాలయ్య అనుచిత వ్యాఖ్యలపై ఎస్వీ రంగారావు వారసుల షాకింగ్ రెస్పాన్స్