Chitragupta Temple | వందల ఏళ్ల చరిత్ర కలిగి హైదరాబాద్ మహా నగరంలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు, చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచే ఆనవాళ్లు ఉన్నాయి. ఇలాంటి వాటిలో చిత్రగుప్తుడి ఆలయం ఒకటి. అయోధ్య, ఉజ్జయినీ, జబల్పూర్, రామ్ఘాట్, కాంచీపురంలో మాత్రమే చిత్రగుప్తునికి ఆలయాలు ఉన్నాయి. దక్షిణాదిలో కాంచీపురం తర్వాత హైదరాబాద్లోనే ఈ ఆలయం ఉంది. యముడి దగ్గర చిట్టాలు రాసే చిత్రగుప్తుడికి ఆలయాలు ఉండటమే అరుదైన విషయం. అలాంటిది మన హైదరాబాద్లోనే కొలువైన చిత్రగుప్తుడి ఆలయం గురించి చాలామందికి తెలియదు. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఎలా వెళ్లాలి? దీని విశిష్ఠత ఏంటో ఓ లుక్కేయండి..
ఎక్కడుంది?
హైదరాబాద్ ఉప్పుగూడలోని కందికల్గేటు సమీపంలోనే చిత్రగుప్తుడి ఆలయం ఉన్నది. నాంపల్లి నుంచి 9 కిలోమీటర్ల దూరంలో కందికల్గేటు ఉంటుంది. చార్మినార్ మీదుగా బస్సులు, ఇతర వాహనాలలో నేరుగా చిత్రగుప్తుడి ఆలయం వద్దకు చేరుకోవచ్చు. రైల్లో వెళ్లాలనుకుంటే ఉప్పుగూడ రైల్వేస్టేషన్లో దిగాలి. అక్కడే ఈ ఆలయం కనిపిస్తుంది. నాగార్జునా సాగర్, విజయవాడ, ఇన్నర్ రింగ్రోడ్డు నుంచి వచ్చేవాళు చాంద్రాయణగుట్ట చేరుకుని అక్కడ్నుంచి పాతబస్తీకి వెళ్లే మార్గంగా నేరుగా ఉప్పుగూడ వెళ్లొచ్చు.
250 ఏళ్ల చరిత్ర
ఈ చిత్రగుప్తుడి ఆలయానికి దాదాపు 250 ఏండ్ల చరిత్ర ఉంది. కాయస్త సామాజిక వర్గానికి చెందిన రాజులు ఈ ఆలయానికి అంకురార్పణ చేసినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానానికి రెండుసార్లు ప్రధానిగా పనిచేసిన రాజా కిషన్ పర్షాద్ ఈ ఆలయాన్ని వెలుగులోకి తెచ్చి అభివృద్ధి చేశారని కూడా కొందరి వాదన. ఉత్తర ప్రదేశ్, బీహార్ నుంచి వలస వచ్చిన కాయస్తులు నిర్మించారని స్థానికులు చెబుతుంటారు. మొత్తం ఈ ఆలయం మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అయితే క్రమంగా చిత్రగుప్తుడి ఆలయ అన్యాక్రాంతమవుతూ ఉంది. దీన్ని పరిరక్షించి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరతున్నారు. చిత్రగుప్తుడు తన ఇద్దరు భార్యలతో కలిసి ఉన్న రాతి విగ్రహం ఇక్కడ కొలువుతీరి ఉంటుంది. ఇక్కడే శివాలయం, సాయిబాబా, హనుమంతుడు, అయ్యప్ప ఆలయాలు కూడా ఉన్నాయి. చిత్రగుప్తుడి ఆలయం పూర్తిగా మట్టితో నిర్మించారు. తూర్పువైపున గోడకు ప్రధాన ద్వారం ఉంటుంది.
ఆలయ విశిష్ఠత ఏంటి?
ఇక్కడ కొలువైన చిత్రగుప్తుడికి పూజలు చేస్తే పాపాలకు కొంతవరకు మోక్షం లభించే అవకాశం ఉంటుందని భక్తుల నమ్మకం. పుణ్యాలు చేసేవాళ్లు కొలిస్తే స్వర్గం ప్రాప్తిస్తుంది అని చెబుతుంటారు. అకాల మృత్యువును జయించడానికి మాత్రమే కాదు ఆరోగ్యం, చదువు, పెళ్లి, సంతానం ఇలా అనేక సమస్యలకు పరిష్కారం కోసం ఈ దేవాలయాన్ని వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. కేతు గ్రహ దోష నివారణకు కూడా ఇక్కడ పూజలు జరుగుతుంటాయి. దీపావళి రెండో రోజు యమద్వితీయ. ఆరోజు చిత్రగుప్తుడి పుట్టిన రోజు. ఆరోజు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. దీన్నే భాయ్ దూజ్ అంటారు. చిత్రగుప్తుడికి ఇష్టమైన రోజు బుధవారం. ఆరోజు అభిషేకం, ప్రత్యేక పూజలు జరిపితే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.
ఇంకా ఎక్కడ ఉన్నాయి?
పూర్వం శ్రీరాముడు అయోధ్యలో చిత్రగుప్తుడికి ఆలయం కట్టాడనీ చెప్తుంటారు. అదే ఇప్పుడు ధర్మహరి చిత్రగుప్త దేవాలయంగా వర్ధిల్లుతున్నదని చెప్తుంటారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్, రామ్ఘాట్, ఉజ్జయిని, ఖజరహో ప్రాంతాల్లో చిత్రగుప్తుడికి ఆలయాలు ఉన్నాయి. దక్షిణాదిన తమిళనాడులోని కాంచీపురంలో చిత్రగుప్తుడి ఆలయం ఉన్నది.
Read More Articles:
Temples | ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?