DC vs RCB | టైమ్ 2 న్యూస్, బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) రెండో విజయం ఖాతాలో వేసుకుంది. శనివారం డబుల్ హెడర్లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొలి పోరులో బెంగళూరు 23 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తు s. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (34 బంతుల్లో 50; 6 ఫోర్లు, ఒక సిక్సర్) సీజన్లో మూడో అర్ధసెంచరీ నమోదు చేసుకోగా.. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (22; 3 ఫోర్లు, ఒక సిక్సర్), మహిపాల్ లోమ్రర్ (26; 2 సిక్సర్లు), గ్లెన్ మ్యాక్స్వెల్ (24; 3 సిక్సర్లు), షాబాజ్ అహ్మద్ (20 నాటౌట్; 3 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, మిషెల్ మార్ష్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 151 పరుగులకే పరిమితమైంది. మనీశ్ పాండే (38 బంతుల్లో 50; 5 ఫోర్లు, ఒక సిక్సర్) ఒంటరి పోరాటం ఫలితాన్నివ్వలేదు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (19), పృథ్వీ షా (0), మిషెల్ మార్ష్ (0), యష్ ధుల్ (1), అభిషేక్ పొరెల్ (5), అక్షర్ పటేల్ (21) విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడిన విజయ్ కుమార్ 3 వికెట్లు తీయగా.. సిరాజ్ రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. కోహ్లీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
కోహ్లీ కమాల్ ఇన్నింగ్స్
టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన బెంగళూరుకు శుభారంభం దక్కింది. సొంత ప్రేక్షకుల మధ్య బరిలోకి దిగిన బెంగళూరు ఓపెనర్లు ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. నోర్జే వేసిన తొలి ఓవర్లో వరుస బౌండ్రీలతో ఖాతా తెరిచిన విరాట్.. గత మ్యాచ్ ఫామ్ను కొనసాగించగా.. డుప్లెసిస్ క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడాడు. తొలి వికెట్కు 42 పరుగులు జోడించిన అనంతరం అమన్ హకీమ్ ఖాన్ పట్టిన సూపర్ క్యాచ్కు డుప్లెసిస్ ఔటయ్యాడు. అయితే వనడ్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన లోమ్రర్ అండతో.. కోహ్లీ ఇన్నింగ్స్ను నడిపించాడు. ఈ క్రమంలో విరాట్ 33 బంతుల్లో ఐపీఎల్లో 47వ అర్ధశతకం నమోదు చేసుకున్నాడు.
ఆ తర్వాత విరాట్ ఔటైనా.. మ్యాక్స్వెల్ వచ్చీ రాగానే భారీ సిక్సర్లతో విరుచుకుపడటంతో బెంగళూరు 11 ఓవర్లలో 103/2తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ దశలో ఢిల్లీ స్పిన్నర్లు కట్టుదిట్టమైన బంతులతో బెంగళూరు మరింత భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. ఛేదనలో ఢిల్లీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. పృథ్వీ షా పేలవ రీతిలో రనౌట్ కాగా.. పవర్ప్లేలో ఆ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. ఒక ఎండ్లో మనీశ్ పాండే పోరాడినా.. అతడికి సరైన సహకారం లభించలేదు.