Governor Tamilisai | తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళి సై మధ్య నిన్నటివరకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. బడ్జెట్ సమావేశాలపై కోర్టు జోక్యం చేసుకునే వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఏం మాట్లాడతారో.. ఏం జరుగుతుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. అయితే అందరి అంచనాలు తలకిందులు చేస్తూ కేసీఆర్ సర్కారుపై గవర్నర్ తమిళిసై ప్రశంసల వర్షం కురిపించారు.
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా గవర్నర్ తమిళి సైకి స్వాగతం పలకడం విశేషం. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడిన తమిళిసై.. కాళోజీ కవితను చదివి వినిపించారు. పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరి.. తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ పరిపాలన దక్షత, ప్రజాప్రతినిధుల కృషితో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకెళుతోందన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరాతో తెలంగాణ విరాజిల్లుతోందన్నారు. తాగునీటి సమస్యల కోసం తల్లడిల్లిన పరిస్థితుల నుంచి తెలంగాణ బయటపడిందన్నారు.
తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందన, సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు కాళేశ్వరంలాంటి గొప్ప ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేశామన్నారు. రైతుబంధు పథకం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిందని, పచ్చధనంలో తెలంగాణ ప్రపంచ దేశాల ప్రశంసలను పొందుతోందని కొనియాడారు. దేశం నివ్వరబోయే అద్భుతాలను తెలంగాణ ఆవిష్కరిస్తోందని అన్నారు. భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులను పూర్తి చేసి 73 లక్షల 33 వేల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు.
రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, 65 లక్షల మందికి 65వేల కోట్ల రూపాయలను పెడ్డుబడి సాయంగా అందించిన ఘనత తెలంగాణదని ప్రశంసించారు. దళితులకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. తెలంగాణలో మెడికల్ కాలేజీలను 17కు పెంచామని, మరో 9 కళాశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వడమే కాకుండా.. పింఛన్ దారుల వయోపరిమితిని 57 ఏళ్లకు తగ్గించామన్నారు.
పల్లె పట్టణ ప్రగతితో జీవన ప్రమాణాలు పెరిగాయని, రాష్ట్రంలో పచ్చధనం 7.7 శాతం పెరిగిందని పారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా చెప్పిందన్నారు. హైదరాబాద్కు ట్రీ సిటీ ఆప్ ది వరల్డ్ గుర్తింపు దక్కిందన్నారు. పారిశ్రామిక, ఐటీ రంగాల్లో రూ.3.31 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామన్నారు. ఐటీ ఉద్యోగాల్లో 140 శాతం వృద్ధి నమోదైందన్నారు. యాదాద్రి పునర్నిర్మాణం అద్భుతమని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్త సచివాలయం నిర్మాణం జరుగుతోందన్న తమిళిసై.. కొత్త సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టుకున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల ఎత్తులో అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మిస్తున్నామన్నారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
K. Vishwanath | కే. విశ్వనాథ్ మృతి పట్ల ప్రధాని మోదీ, తమిళిసై, కేసీఆర్, జగన్ సంతాపం..