SSC Exams | పదోతరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం ఇప్పటికే తెలంగాణలో కలకలం రేపుతుండగా మరో అనూహ్య ఘటన వెలుగులోకి వచ్చింది. పరీక్ష ప్రారంభమైన తొలి రోజునే విద్యార్థుల జవాబు పత్రాలు మాయమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.
ఉట్నూరులోని 5 ఎగ్జామ్ సెంటర్స్లో మొత్తం 1011 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. మధ్యాహ్నం పరీక్షల ముగియనగానే విద్యార్థుల ఆన్సర్ షీట్స్ను బండిల్స్గా చేసి పోస్టాఫీసులో అప్పగించారు. అక్కడ పోస్టల్ సిబ్బంది జవాబు పత్రాలు అన్నింటినీ మూల్యాంకన కేంద్రాలకు తరలించేందుకు 11 కట్టలుగా వేరు చేశారు. ఆ తర్వాత ఆటోలో పోస్టాఫీసు నుంచి ఉట్నూరు బస్టాండ్కు తరలించారు. అక్కడ బస్సులో ఎక్కించేముందు జవాబుపత్రాల కట్టలను ఒక్కసారి లెక్కించుకున్నారు. అప్పుడు మొత్తం 11 కట్టలు ఉండాల్సిన చోట.. పది కట్టలు మాత్రమే ఉన్నాయి.
ఆటోలో తీసుకొస్తుండగా ఎక్కడైనా పడిపోయి ఉంటాయనే ఉద్దేశ్యంతో పోస్టాఫీసు నుంచి బస్టాండ్ మార్గంలో అంతటా వెతికారు. కానీ ఎక్కడ ఆన్సర్ షీట్స్ కట్ట కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన పోస్టల్ సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆన్సర్ షీట్స్ ఎక్కడ మిస్సయ్యాయనే విషయాన్ని దర్యాప్తు చేస్తున్నారు. ఆన్సర్ షీట్స్ అదృశ్యమైన విషయం తెలియగానే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.