Mission Prarambh | దేశంలోనే తొలి ప్రైవేటు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ( Skyroot ) ఏరోస్పేస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ శుక్రవారం నిర్వహించిన మిషన్ ప్రారంభ్ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ( ISRO ) శాస్త్రవేత్తలు ప్రకటించారు. నిజానికి ఈ ప్రయోగాన్ని ఈ నెల 12వ తేదీన చేపట్టాల్సింది. కానీ ఆ రోజు వాతావరణం అనుకూలించకపోవడంతో ఇవాల్టికి వాయిదా వేశారు. శుక్రవారం ఉదయం 11:30 గంటలకు విజయవంతంగా ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ సోమ్నాథ్ ప్రకటించారు. మిషన్ ప్రారంభ్ విజయోత్సాహంతో.. అంతరిక్ష ప్రయోగాలకు ఇది కొత్త ఆరంభమని అన్నారు.
భారత అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేటు సంస్థలకు ఆహ్వానం పలుకుతూ ప్రధాని నరేంద్ర మోదీ 2020లో పిలుపునిచ్చారు. ఈ ఆహ్వానం మేరకు హైదరాబాద్కు చెందిన స్కైరూట్ సంస్థ ముందుకొచ్చింది. మిషన్ ప్రారంభ్ పేరిట చేపట్టిన ఈ ప్రయోగంలో భాగంగా తక్కువ ఖర్చుతో రెండేళ్లలోనే ఈ రాకెట్ను తయారుచేసింది. అంతరిక్ష ప్రయోగాలకు అంకురార్పణ చేసిన విక్రమ్ సారాభాయ్కి నివాళిగా ఈ రాకెట్కు విక్రమ్ ఎస్ అని నామకరణం చేసినట్టు సీఈవో పవన్ కుమార్ వెల్లడించారు. రాకెట్ తయారీలో భాగంగా స్కైరూట్ ఏరోస్పేస్ సుమారు 408 కోట్ల పెట్టుబడిని సమీకరించింది.
Mission Prarambh రాకెట్ ప్రత్యేకత ఏంటంటే..
విక్రమ్ ఎస్ రాకెట్ ప్రత్యేకత ఏంటంటే.. ఇది సింగిల్ స్టేజ్ సబ్ ఆర్బిటల్ లాంచ్ వెహికిల్. దీని పొడవు 6 మీటర్లు, బరువు 545 కిలోలు. ఈ రాకెట్ మూడు పేలోడ్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. వాటిలో రెండు స్వదేశీ, ఒక విదేశీ పేలోడ్లు. ఇందులో చెన్నై కేంద్రంగా నడస్తున్న స్పేస్ కిడ్జ్ ఒక పేలోడ్ను రూపొందించింది. 2.5కిలోల బరువు ఉన్న ఈ ఫన్శాట్ పేలోడ్ను భారత్తో పాటు అమెరికా, సింగపూర్, ఇండోనేసియాకు చెందిన విద్యార్థులు అభివృద్ధి చేశారు.