Meesho bumper offer | కరోనా వల్ల వర్క్ కల్చరే మారిపోయింది. వర్క్ ఫ్రం హోంలు మొదలయ్యాయి. సాఫ్ట్వేర్ నుంచి అన్ని రంగాల్లోనూ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం కల్చర్కు అలవాటైపోయారు. అయితే.. ఇప్పుడు కరోనా కష్టాలు తీరిపోవడంతో అన్ని సంస్థలు ఆఫీసుకు రావాలని ఉద్యోగులకు పిలుపునిచ్చేశాయి. కానీ ఆన్లైన్ రిటైల్ స్టార్టప్ మీషో మాత్రం కాస్త వెరైటీగా ఆలోచించింది.
వారంలో ఒక్కరోజే ఆఫీసుకు రండి.. మిగతా రోజులు ఇంటి దగ్గరి నుంచే పనిచేయాలంటూ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 2023 జూన్ నుంచి వారంలో ఒక్క రోజే ఆఫీసుకు రండి అంటూ పిలుపునిచ్చింది. మెజారిటీ ఉద్యోగుల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. తమ అభిప్రాయం మేరకు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
‘ఉద్యోగుల సలహాలు, సూచనల ఆధారంగా మార్పులు చేయడం అనేది మా సంస్థ సిద్ధాంతం. రెస్ట్రిక్షన్స్ లేకుంటేనే ఉత్పాదకత పెరుగుతుందని మేం నమ్ముతాం. సంస్థ నిర్వహించిన సర్వేల్లోనూ అదే తేలింది. ఒక టీమ్గా ఉద్యోగులకు మధ్య సాన్నిహిత్యం పెరిగేందుకు దోహదపడుతుంది. ‘ అని మీషో హెచ్ఆర్ అశిష్ కుమార్ వెల్లడించారు.
మీషోను ఐఐటీలో ఢిల్లీలో చదివిన విదిత్ ఆత్రేయ్, సంజీవ్ బమ్యల్ 2015లో ప్రారంభించారు. ఇందులో ప్రస్తుతం 1850 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో సగం మంది బెంగళూరులో ఉండగా.. మిగతా వాళ్లు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నారు. కంపెనీ తీసుకున్న తాజా నిర్ణయంతో ఉద్యోగులంతా బెంగళూరు మకాం మారాల్సిన అవసరం లేకుండా పోయింది. వారానికి ఒకసారి ఆఫీసుకు వెళ్లొస్తే సరిపోతుందన్నమాట.
Read More Articles |
Avatar2 Review | అవతార్ 2 రివ్యూ.. జేమ్స్ కామెరూన్ మరోసారి మాయ చేశాడా?
Manchu Manoj | భూమా మౌనికతో త్వరలోనే పెళ్లి? మంచు మనోజ్ వ్యాఖ్యలకు అర్థం అదేనా?