Scam | ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు పొందేందుకు చాలామంది చాలా రకాల అబద్ధాలు చెబుతుంటారు. కానీ ఒక మహిళ అయితే ఏకంగా తనకు కళ్లు కనిపించవనే మోసం చేసింది. అంధురాలినని నకిలీ సర్టిఫికెట్ చూపించి నెల నెల పింఛన్ పొందింది. అలా ఒకటి రెండు కాదు.. 15 ఏళ్లుగా ప్రభుత్వ అధికారులను మోసం చేసి ప్రభుత్వం నుంచి దాదాపు రూ.1.8 కోట్ల వరకు పింఛన్ అందుకుంది. చివరకు ఇన్నేళ్ల తర్వాత ఆమె బండారం బయటపడింది.
వివరాల్లోకి వెళ్తే.. ఇటలీకి చెందిన 48 ఏళ్ల మహిళ ఇంట్లో కూర్చునే డబ్బు పొందాలని అత్యాశపడింది. సామాజిక భద్రత పింఛన్ అప్లై చేసుకుంటే నెలనెలా పెన్షన్ రూపంలో డబ్బులు పొందవచ్చని అనుకుంది. ఇందుకోసం తనకు కళ్లు కనిపించవని ఓ డాక్టర్ నుంచి నకిలీ సర్టిఫికెట్ తీసుకుంది. ఆ ధ్రువపత్రం ఆధారంగా సామాజిక భద్రత పింఛన్కు దరఖాస్తు చేసుకుంది. 15 ఏళ్లుగా పెన్షన్ పొందుతూనే ఉంది. అలా 15 ఏళ్లలో దాదాపు రూ.1.8 కోట్లను పింఛన్ రూపంలో సదరు మహిళ అందుకుంది. కానీ చేసిన తప్పు ఎక్కువ రోజులు దాగదు అని పెద్దలు చెప్పినట్టుగా రీసెంట్గా ఆమె భండారం బయటపడింది. పింఛన్ డబ్బులు తీసుకునేందుకు వెళ్లిన మహిళ సెల్ఫోన్ వాడుతూ.. ఫైళ్లపై సంతకాలు పెట్టడాన్ని అధికారులు గమనించారు. దీంతో ఆమెను ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దీంతో ఆమెకు ఇస్తున్న పింఛన్ను వెంటనే నిలిపివేశారు. ఆమెపై చట్టపరమైన చర్యలకు కూడా సిద్దమయ్యారు. అంతేకాదు ఆమెకు నకిలీ సర్టిఫికెట్ ఇచ్చిన వైద్యుడిపై కూడా చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్దమవుతున్నారు.