Martin Cooper | ఒకప్పుడు పక్క ఊర్లో ఉన్న వ్యక్తికి సమాచారం అందించాలన్నా గంటలు.. రోజులు పట్టేది. కానీ మొబైల్ ఫోన్లు వచ్చాక అంతా మారిపోయింది. ప్రపంచంలో ఏ మూలకు ఉన్న వ్యక్తికి అయినా సరే క్షణాల్లో ఫోన్ చేసి విషయం చెప్పేయొచ్చు. సమాచారం త్వరగా చేరవేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ సెల్ఫోన్లు ఇప్పుడు మనిషి జీవితంలో భాగమైపోయాయి. అతన్ని బానిసను చేసుకుని శాసించే స్థాయికి కూడా వెళ్లిపోయాయి. పక్కన ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా కొంతమంది మొబైల్లో తలపెట్టి కాలక్షేపం చేసేస్తున్నారు. ఇలా తమ పిల్లలు సెల్ఫోన్లో లీనమైపోవడం చూసి తల్లిదండ్రులు వారించడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు ఇలాంటి విపత్కర పరిస్థితిని చూసి ఏకంగా సెల్ఫోన్ పితామహుడే ఆందోళన చెందుతున్నాడు. మరి ఇంతలా ఎలా వాడతారని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
సెల్ఫోన్ పితామహుడిగా పేరుగాంచిన 94 ఏళ్ల అమెరికన్ ఇంజనీర్ మార్టిన్ కూపర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. మొబైల్ వినియోగం పరిమితి మించడంపై ఆవేదన వ్యక్తం చేశాడు. కొంతమంది వ్యక్తులు తమ సెల్ఫోన్లు చూస్తూ రోడ్లు దాటడం చూసి చాలా షాకయ్యానని తెలిపాడు. వాళ్లు పూర్తిగా మైండ్ ఎక్కడో పెట్టి నడుస్తున్నారని అన్నాడు. ఇలా ఫోన్లలో లీనమైన రోడ్లు దాటున్నప్పుడు కార్ల కింద పడితే తప్ప మిగతావారు ప్రమాదాన్ని గుర్తించట్లేదు అని సరదాగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం చాలామంది మొబైల్ ఫోన్ పట్టుకుని వేలాడున్నారని.. కానీ ఇది ఎంతోకాలం కొనసాగకపోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రతితరం కొత్త ఆలోచనలతో ముందుకెళ్తోందని చెప్పుకొచ్చాడు.