Rahul Gandhi | పరువు నష్టం కేసులో శిక్ష పడటంతో ఇప్పటికే అనర్హత వేటుకు గురైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మరో షాక్ తగిలింది. తనకు కేటాయించిన అధికారిక బంగ్లాను వెంటనే ఖాళీ చేయాలని లోక్సభ హౌసింగ్ కమిటీ రాహుల్కు నోటీసులు పంపిందని సమాచారం. ఏప్రిల్ 22లోగా అధికార బంగ్లాను ఖాళీ చేయాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
2004 ఎన్నికల్లో లోక్సభ ఎంపీగా ఎన్నికైన తర్వాత ఢిల్లీలోని తుగ్లక్ లేన్లో ఉన్న బంగ్లాను రాహుల్ గాంధీకి కేటాయించారు. అప్పట్నుంచి రాహుల్ అక్కడే నివాసం ఉంటున్నారు. అయితే 2019లో దాఖలైన పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు తాజాగా రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ప్రజాప్రతినిధ్యం చట్టం ప్రకారం రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. దీనివల్ల ఎంపీగా సభ్యత్వాన్ని కోల్పోవడంతో పాటు ఆయనకు వచ్చే ప్రభుత్వ సదుపాయాలు, ఇతర ప్రయోజనాలు రద్దవుతాయి. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Follow Us : Google News, Facebook, Twitter