Cyber Crime | ఆన్లైన్లో కిడ్నీ అమ్మేందుకు యత్నించి ఓ యువతి రూ.16 లక్షలు పోగొట్టుకుంది. 3 కోట్లు వస్తాయని ఆశపడితే ఉన్న డబ్బంతా పోయింది. దీంతో లబోదిబోమంటూ ఆ యువతి పోలీసులను ఆశ్రయించయడంతో ఈ విషయం బయటకొచ్చింది. ఏపీలోని గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలం సృష్టించింది.
గుంటూరు జిల్లాకు చెందిన బాధిత యువతి.. హైదరాబాద్లో నర్సింగ్ చేస్తోంది. తన అవసరాల కోసం వాళ్ల నాన్న ఏటీఎం కార్డులో నుంచి రూ.2 లక్షలు వాడుకుంది. ఈ విషయం ఇంట్లో తెలిస్తే తిడతారని భయపడిపోయింది. అదే సమయంలో కిడ్నీ అమ్మితే డబ్బులు వస్తాయని ఒక వెబ్సైట్లో చూసి వాళ్లకు సంప్రదించింది. యువతి అవసరాన్ని ఆసరా చేసుకున్న సైబర్ నేరగాళ్లు 3 కోట్లు ఇస్తామంటూ ఆశచూపారు. ఇదంతా నిజం అని నమ్మించేందుకు మొదట రూ.10వేలు యువతి అకౌంట్లో వేశారు.
ఇక రెండో నెలలో చెన్నై సిటీ బ్యాంకులో అకౌంట్ క్రియేట్ చేసి రూ.3కోట్లు డిపాజిట్ చేసినట్టు నమ్మించారు. ఆ డబ్బులు రావాలంటే ట్యాక్స్ల కింద డబ్బులు కట్టాలని సైబర్ నేరగాళ్లు చెప్పడంతో.. విడతలవారీగా రూ.16 లక్షలు పంపించింది. ఇలా రోజులు గడుస్తున్నా డబ్బులు రాకపోవడంతో మళ్లీ వెబ్సైట్లో చూసిన నంబర్లకు కాల్ చేసింది. అప్పుడు డబ్బులు కావాలంటే ఢిల్లీ రావాలని చెప్పడంతో ఆమె అక్కడికి వెళ్లింది. కానీ వాళ్లు చెప్పిన అడ్రస్కు వెళ్తే అక్కడ ఏ ఆఫీస్ లేకపోవడంతో మోసపోయానని గ్రహించింది. తిరిగి హైదరాబాద్కు వచ్చి గుట్టుగా ఉంటుంది.
అదే సమయంలో తన అకౌంట్లో డబ్బులు మాయమయ్యాయని గ్రహించిన తండ్రి.. సదరు యువతికి కాల్ చేసి నిలదీశాడు. డబ్బులు పోగొట్టానని తెలిస్తే కొడతారనే భయంతో ఆ యువతి జగ్గయ్యపేటలోని తన స్నేహితురాలి ఇంటికి పారిపోయింది. అక్కడి నుంచి కూడా కూతురు మిస్సవడంతో ఆ తండ్రి.. కంచర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.తండ్రి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు.. సదరు యువతిని పట్టుకున్నారు. అప్పుడు ఆమె సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన విషయాన్ని బయటపెట్టింది. అక్కడి పోలీసుల సూచన మేరకు బాధితులు ఈ విషయాన్ని గుంటూరు ఎస్పీకి విన్నవించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
Read More Articles |
Varahi Registration | పవన్ కళ్యాణ్ వారాహి వివాదానికి ఫుల్ స్టాప్.. తెలంగాణలో రిజిస్ట్రేషన్ కంప్లీట్