Bone Health | వయసు పెరిగినా కొద్దీ కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు రావొద్దంటే ఎముకలు బలంగా ఉండాల్సిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో 35-40 ఏళ్లకే కాళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఎముకల విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా 35 ఏండ్లు వచ్చే వరకు ఎముకలు దృఢంగానే ఉంటాయి. కానీ.. ఆ తర్వాత నుంచి బలం తగ్గిపోతుంటుంది. మహిళల్లో రుతుక్రమం ఆగిపోయిన తర్వాత వేగంగా బలహీన పడతయాయి. కాబట్టి ఆహారంలో మార్పులు చేసుకుంటే ఎముకల సాంద్రత తగ్గకుండా చూసుకోవచ్చు. అందుకోసం కాల్షియం ఎక్కువ ఉన్న ఈ ఆహార పదార్థాలను రోజూవారీ భోజనంలో భాగంగా చేసుకోవాల్సిందే.
పాలు
పాలల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. పావు లీటరు పాలు తాగితే శరీరానికి దాదాపు 300 మిల్లీ గ్రాముల కాల్షియం అందుతుంది. ఎముకలు గట్టిగా ఉండటంలో కాల్షియమే కీలకం కాబట్టి.. రోజూ పాలు తాగితే ఎముకకు బలంగా ఉంటాయి. సాధారణంగా పెద్దవాళ్లకు 50 ఏండ్ల వయసు వరకు రోజుకు 1000 మిల్లీ గ్రాముల కాల్షియం అవసరం. 50 ఏండ్ల పైబడిన మహిళలకు 1200 మిల్లీ గ్రాముల కాల్షియం అవసరం ఉంటుంది.
ఆకు కూరలు
ఆకు కూరల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పాలకూర, తోటకూర లాంటివి తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. కప్పు ఆకుకూరల నుంచి 200 మిల్లీ గ్రాముల కాల్షియం లభిస్తుంది.
సోయా
సోయా ఉత్తత్తులలో కాల్షియం, ఐసో ప్లేవన్స్ అధికంగా ఉంటాయి. ఎముక సాంద్రతకు ఇవి ఉపయోగపడతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.రుతు క్రమం ఆగిపోయిన మహిళలకు మేలు చేస్తాయి.
చేపలు
పాలు, ఆకు కూరలు, సోయా ఉత్పత్తులే కాదు.. చేపల్లోనూ కాల్సియం ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా సాల్మన్ వంటి చేపల్లో కాల్షియంతో పాటు విటమిన్ డీ కూడా లభిస్తుంది. కాల్షియాన్ని శరీరం గ్రహించడానికి విటమిన్ డీ సహాయపడుతుంది కూడా.
బాదం, పిస్తా..
ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే బాదం, పిస్తా, జీడిపప్పులను రోజూవారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. బాదం, పిస్తా, పొద్దుదిరుగుడు విత్తనాల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. వాల్నట్స్, అవిసె గింజల్లో ఓమేగా 3 కొవ్వుఆమ్లాలు కూడా ఉంటాయి. వేరుశనగల్లో పొటాషియం ఉంటుంది. ఇది మూత్రంలో కాల్షియం బయటకు వెళ్లకుండా ఆపుతుంది.
మనం ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రంలో కాల్షియం ఎక్కువగా పోతుంది. ఎముకలు బలహీనంగా తయారవుతాయి. కాబట్టి ఉప్పు వాడకాన్ని తగ్గిస్తేనే బెటర్. అంతేకాదు.. శరీరానికి కచ్చితంగా రోజూ ఎండ తగిలేలా చూసుకోవాలి. మన శరీరం కాల్షియాన్ని గ్రహించాలంటే విటమిన్ డీ అవసరం. అది ఎండలో నిలబడితే శరీరానికి అవసరమైనంతగా అందుతుంది.
Read More Articles |
Smart phone | కొత్త స్మార్ట్ ఫోన్ కొంటే ఏడాది కాకుండానే ఎందుకు పాడవుతున్నాయి?