Eyestrain with screen time | ఈ రోజుల్లో పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా చేతిలో మొబైల్ ఉండాల్సిందే. దీంతో స్క్రీన్ టైమ్ విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఉద్యోగులు మాత్రమే కంప్యూటర్ ముందు గడిపేవారు.. కానీ కరోనా పుణ్యమా అని విద్యార్థులు కూడా ఆన్లైన్ క్లాసులు అంటూ విద్యార్థులు కూడా ల్యాప్టాప్లు, మొబైల్స్ను ముందటేసుకుంటున్నారు. గంటల కొద్దీ స్క్రీన్ ముందు గడిపేస్తున్నారు. అవసరాల కోసం అయిపోయిన తర్వాత ఎంటర్టైన్మెంట్ వీడియోలు చూడటానికి, గేమ్స్ ఆడటానికి అంటూ రకరకాల కారణాలతో రోజంతా స్క్రీన్కు అతుక్కుపోతున్నారు. దీనివల్ల కంటి సంబంధిత సమస్యలతో బాధపడేవారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూహెచ్వో ) నివేదిక ప్రకారం 2021లో ప్రపంచవ్యాప్తంగా 2.2 బిలియన్లకు పైగా జనాలు దృష్టిలోపంతో బాధపడుతున్నట్టు వెల్లడైంది.
స్క్రీన్ టైమ్ పెరగడంపై కంటి వైద్య నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజులో 8 గంటల కంటే ఎక్కువ సేపు స్క్రీన్ చూసే వారిలో హ్రస్వ దృష్టి ( మయోపియా ) బారిన పడుతున్నట్టు తెలిపారు. స్క్రీన్ను అదే పనిగా చూస్తున్న సమయంలో రెప్పవేయడం తగ్గుతుందని.. దీని కారణంగా కళ్లు ఎండిపోతున్నాయని వైద్యులు చెబుతున్నారు. డ్రై ఐస్ కారణంగా కళ్లు మండటం, చికాకు, ఏకాగ్రత కోల్పోవడం వంటి సమస్యలు వస్తున్నాయని పేర్కొంటున్నారు. అందుకే స్క్రీన్ టైమ్ను తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ స్క్రీన్ టైమ్ తగ్గించడం కుదరని వాళ్ల కోసం కొన్ని చిట్కాలను సూచిస్తున్నారు.
కంటి సమస్యలను ఎలా తగ్గించుకోవాలి?
ఉద్యోగులు, విద్యార్థులు స్క్రీన్ టైమ్ను తగ్గించుకోవడం కుదరకపోవచ్చు. అందుకే వారికోసం 20-20-20 ఫార్ములాను కంటి వైద్యులు సూచిస్తున్నారు. ఈ విధానం ప్రకారం ప్రతి 20 నిమిషాల స్క్రీన్ టైమ్ తర్వాత 20 సెకన్లు బ్రేక్ తీసుకోవాలి. ఆ గ్యాప్లో 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులపై దృష్టి పెట్టాలి. దీనివల్ల స్క్రీన్ టైమ్ కారణంగా కళ్లపై పడే ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఐబాల్ సైజ్లో ఏ మార్పు రాకుండా జాగ్రత్త పడవచ్చు. దీని కారణంగా కళ్లు తడిఆరిపోవడం, హ్రస్వ దృష్టి వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. అదే చిన్న పిల్లలు అయితే ప్రతి గంటలో ఒక 10 నిమిషాలు గ్యాప్ తీసుకోవాలని సూచిస్తున్నారు.
Read More Articles |
Hair fall | రాత్రి పూట తలస్నానం చేస్తున్నారా? బట్టతల వచ్చే ఛాన్స్ ఉంది జాగ్రత్త