TSPSC Paper Leakage | పేపర్ లీకేజీ వ్యవహారంలో ఇప్పటికే విమర్శలను ఎదుర్కొంటున్న టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. మరో నియామక పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 4న జరగాల్సిన హార్టీకల్చర్ ఆఫీసర్ పరీక్షను వాయిదా వేసినట్లు ప్రకటించింది. వాయిదా వేసిన ఈ పరీక్షను జూన్ 17న నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ తెలిపింది.
అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీతో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ సహా ఏఈఈ, డీఏవో పరీక్షలను ఇదివరకే టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. రద్దు చేసిన ఈ పరీక్షలను మేలో నిర్వహించేందుకు కమిషన్ కసరత్తు చేస్తోంది. దీనికోసం ఈ వారంలోనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. కాగా, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమ్స్, అసిస్టెంట్ ఇంజనీర్ సహా పలు పోస్టులకు సంబంధించిన పేపర్లు లీక్ చేసిన ప్రవీణ్కుమార్, రాజశేఖర్ రెడ్డి భారీ స్కెచ్ వేసినట్లు తెలిసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ను సక్సెస్ఫుల్గా కొట్టేసిన వాళ్లు.. మెయిన్స్ పేపర్ కూడా లీక్ చేసేందుకు కూడా ప్లాన్ చేసినట్లు సిట్ విచారణలో వెల్లడైంది. పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితులైన ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డి, రేణుక భర్త ఢాక్యా నాయక్, ఆమె సోదరుడు రాజేందర్ను సిట్ విచారించగా కీలక విషయాలు వెల్లడించారు.
సిస్టమ్ హ్యాక్ చేసి.. పేపర్ లీక్
కస్టోడియన్ శంకరలక్ష్మీ డైరీ నుంచి యూజర్ ఐడీ, పాస్వర్డ్ దొంగిలించామని ముందుగా చెప్పిన స్టేట్మెంట్ అబద్ధమని రాజశేఖర్ రెడ్డి ఒప్పుకున్నాడు. సిస్టమ్ హ్యాక్ చేసి పాస్వర్డ్ సంపాదించామని వెల్లడించాడు. ప్రవీణ్ సిస్టమ్ నుంచే కస్టోడియన్ సిస్టమ్ ఓపెన్ చేశామని ఒప్పుకున్నాడు. కాగా, గ్రూప్-1 ప్రిలిమ్స్లో 100 మార్కులు దాటిన 121 మందిని గుర్తించిన సిట్ వారిలో 60 మందిని విచారించింది. పేపర్ లీకేజి ఘటనలో సోమవారం మరో వ్యక్తిని సిట్ అరెస్టు చేసింది. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య 15కు చేరింది.
ఒకరికి తెలియకుండా మరొకరి ఎత్తులు
గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాన్ని లీక్ చేసి సక్సెస్ కావడంతో ఏఈ ప్రశ్నపత్రం లీక్ చేసి భారీగా డబ్బులు సంపాదించాలని ప్రవీణ్, రాజశేఖర్రెడ్డి స్కెచ్ వేశారు. ఈ క్రమంలోనే రేణుకకు పేపర్ ఇచ్చి రూ.10 లక్షలు తీసుకున్నారు. ఇంకా మెయిన్స్ రాయాల్సి ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని.. ఎవరికైనా తెలిస్తే అందరం దొరికిపోతాం.. ఉన్న ఉద్యోగాలు ఊడిపోతాయని రేణుకకు వాళ్లు వార్నింగ్ కూడా ఇచ్చారు. కానీ రేణుకకు తెలియకుండా ఆమె భర్త ఢాక్యా నాయక్, సోదరుడు రాజేశ్వర్ పెద్ద స్కెచ్ వేశారు. ఈ పేపర్ను బయట అమ్మి భారీగా సొమ్ము చేసుకోవాలని ఆశపడ్డారు. దీంతో జాతీయ ఉపాధి హామి పథకంలో పనిచేసే కాంట్రాక్టర్ తిరుపతయ్యతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అతని ద్వారా ప్రశాంత్ రెడ్డి, రాజేందర్ కుమార్ను సంప్రదించి రూ.17.5 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు.
Follow Us : Google News, Facebook, Twitter