SSC Exam Paper Leak | పదో తరగతి పరీక్షల నిర్వహణలో వరుసగా అవకతవకలు బయటపడుతున్నాయి. మొదటి రోజు తెలుగు ప్రశ్నపత్రం చక్కర్లు కొట్టిన ఉదంతంపై ఇంకా విచారణ కొనసాగుతున్న సమయంలోనే.. ఇవాళ హిందీ పేపర్ కూడా వాట్సాప్లో సర్క్యూలేట్ అవ్వడం సంచలనంగా మారింది. వరంగల్ జిల్లాలో రెండో రోజు ఉదయం 9 గంటలకు హిందీ ఎగ్జామ్ మొదలవ్వగా.. అరగంటలోనే క్వశ్చన్ పేపర్ వాట్సాప్లోకి వచ్చేసింది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఆదిలాబాద్ టెన్త్ ఆన్సర్ సీట్స్ మిస్సింగ్పై అధికారులు విచారణ జరుపుతున్నారు. పోలీసుల నుంచి ఆదిలాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోస్టాఫీసు నుంచి బస్టాండ్ వరకు ఉన్న సీసీటీవీ ఫుటేజీలు పనిచేయడం లేదని పోలీసులు వివరించారు అందుకే ఆ మార్గంలో ఉన్న షాపుల్లోని సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా విచారణ జరుపుతున్నామని తెలిపారు. జవాబు పత్రాల మిస్సింగ్లో విద్యాశాఖ నిర్లక్ష్యం లేదని ఉట్నూరు ఎంఈవో శ్రీనివాస్ తెలిపారు, 9 మంది విద్యార్థుల పేపర్స్ మిస్సయ్యాయని.. వారికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాగా పదో తరగతి ఆన్సర్ షీట్స్ మిస్సింగ్పై ఉట్నూరు పోస్ట్ మాస్టర్పై పోలీసులు కేసు నమోదు చేశారు.