Telangana | బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఇద్దరినీ సస్సెండ్ చేసింది. ఇటీవల ఖమ్మం జిల్లాలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో వీరిద్దరూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో గులాబీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇటీవల ఖమ్మం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మాజీ మంత్రి జూపల్లి.. బీఆర్ఎస్ పేరుతో చెత్తపాలన దేశానికి ఇస్తారా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పాలన ఎప్పుడో గాడి తప్పిందంటూ సొంత పార్టీనే విమర్శించారు. ఇక కేసీఆర్ శకం ముగుస్తుందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్గా తీసుకున్నారు. ఈ క్రమంలోనే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.