Mulayam singh yadav | ములాయం సింగ్ యాదవ్.. దేశ రాజకీయ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే పేరు. టీచర్గా, రెజ్లర్గా జీవితాన్ని ప్రారంభించిన ఆయన.. యూపీతో పాటు దేశ రాజకీయాల్లో తనదైన ముద్రవేశాడు. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం ఉత్తర్ప్రదేశ్కు మూడు సార్లు ముఖ్యమంత్రిగా, కేంద్ర రక్షణ శాఖ మంత్రిగానూ పనిచేశాడు. అయితే.. ఆయనకేం రాజకీయ వారసత్వం లేదు. పుట్టుకతో కోటీశ్వరుడేం కాదు. కానీ ములాయం జీవితాన్ని ఒకే ఒక సంఘటన మలుపు తిప్పింది. అది సంఘటన జరగకుంటే దేశం ఒక గొప్ప నాయకుడిని మిస్సయ్యేదేమో. ఇంతకీ ఆయన జీవితాన్ని మలుపు తిప్పిన ఘటన.. ఏంటి ? ఏం జరిగిందనే విషయాలను చూస్తే..
రాజకీయాల్లోకి దారి చూపింది.. ఆ టెక్నిక్సే
అది 1960వ సంవత్సరం. మొయిన్పురి జిల్లాలో ఓ రెజ్లింగ్ టోర్నమెంట్ జరుగుతోంది. ఆ టోర్నీని ప్రత్యక్షంగా చూసేందుకు ప్రజా సోషలిస్ట్ పార్టీ ఎమ్మెల్యే నాథూ సింగ్ వచ్చారు. ఆ సమయంలో ములాయం ఆయన కంటపడ్డాడు. పొట్టిగా, బలంగా ఉన్న ములాయం సింగ్ ( mulayam singh yadav ) రెజ్లింగ్ స్కిల్స్ను చూసిన నాథూ సింగ్ ఆశ్చర్యపోయాడు. ఆయన కంటే పొడుగ్గా..బలంగా ఉన్న ప్రత్యర్థులను సునాయసంగా పడేస్త్ను ములాయం టెక్నిక్స్ నాథూ సింగ్ను కట్టిపడేశాయి. టోర్నీ అవగానే యువ రెజ్లర్కు తనను కలవాలని ఎమ్మెల్యే కోరారు. ఆ సమయంలో ములాయం ఉన్నత చదువులు చదువుకున్నాడని, స్థానిక జెయిన్ కాలేజీలో టీచింగ్ కూడా చేస్తున్నట్లు తెలుసుకున్న నాథూ సింగ్ ఆశ్చర్యపోయాడు. ఇక అంతే.. ములాయంను తనతో తీసుకెళ్లారు. శిష్యుడిగా మార్చుకున్నారు. అప్పటినుంచే ములాయం రాజకీయ ప్రస్థానం మొదలైంది.
చిన్న వయసులో ఎమ్మెల్యేగా.. రికార్డు
1967లో జరిగిన ఎన్నికల్లో జస్వంత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రజా సోషలిస్టు పార్టీ తరఫున టికెట్ ఇచ్చారు నాథూ సింగ్. అప్పటికి ఆయన వయసు 28 ఏండ్లు. యూపీ చరిత్రలో అత్యంత చిన్న వయసులో ఎమ్మెల్యే అయిన మొదటి వ్యక్తిగా ములాయం సింగ్ యాదవ్ చరిత్ర సృష్టించారు. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎమ్మెల్యే అయ్యాకే తన ఎం.ఏ పూర్తి చేశాడు. ఆ తర్వాత 38 ఏళ్లకు జనాత పార్టీ ప్రభుత్వంలో 1977లో తొలిసారి సహకార శాఖ మంత్రి అయ్యారు.
అజిత్ సింగ్ను వెనక్కి నెట్టి సీఎం పీఠంపై
1996 వరకు జస్వంత్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. చౌధరీ చరణ్ సింగ్ తన రాజకీయ వారసుడిగా ములాయంను, చట్టబద్ధమైన వారసుడిగా సొంత కొడుకు అజిత్ సింగ్ను పిలిచేవారు. చరణ్ సింగ్ తీవ్ర అనారోగ్యం చేసినప్పుడు అజిత్ను పార్టీ అద్యక్షుడిగా చేయాలన్న వాదనను మద్ధతు దారులు వినిపించారు. చరణ్ సింగ్పై ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ 1989లో అజిత్ సింగ్ తో పోటీలో గెలిచి యూపీ ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రమాణ స్వీకారం సమయంలో మాట్లాడుతూ ఒక పేదవాడి కొడుకును ముఖ్యమంత్రి చేయాలన్న లోహియా కల ఇప్పుడు నిజమైంది అంటూ గద్గద స్వరంతో ములాయం అన్నారు.
ప్రధాని పదవి జస్ట్ మిస్..
ఆ తర్వాత 1992లో సమాజ్ వాదీ పార్టీని స్థాపించారు. బీఎస్పీతో పొత్తు పెట్టుకుని 1993 ఎన్నికల్లో 109 సీట్లలో ఎస్పీని గెలిపించారు. సమాజ్వాదీ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రెండో సారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 1996లో తొలిసారి మొయిన్పురీ నుంచి ఎంపీగా గెలుపొంది రక్షణ మంత్రిగా పనిచేశారు. 2003లో మరోసారి యూపీ సీఎం అయ్యారు. 2007వరకు కొనసాగారు. 2004, 2009, 2014, 2019లోనూ ఎంపీగా గెలిచారు. అయితే ప్రధాని పదవికి దేవగౌడ రాజీనామా చేసిన సమయంలో ప్రధాని అయ్యే అవకాశాన్ని తృటిలో కోల్పోయారు. లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్, చంద్రబాబు నాయుడు అడ్డుపుల్లలు వేయడంతోనే ప్రధాని పదవి ములాయంకు మిస్ అయిందని ఇటీవల ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలో శేఖర్ గుప్తా పేర్కనడం విశేషం.
Read More Articles |
ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?
ఒక వ్యక్తి ఎన్ని ఏళ్లు కిరాయి ఉంటే ఆ ఇల్లు అతని సొంతమవుతుంది?
Hallmark Gold | మీ బంగారు ఆభరణాలపై ఉన్న హాల్ మార్క్ అసలుదా.. నకిలీదా గుర్తించడం ఎలా?