Brother and sister died after falling into the toilet drain | అందమైన కుటుంబం.. ముద్దులొలికే ఇద్దరు పిల్లలు. ఒక బాబు.. ఒక పాప. ఇక జీవితమంతా వాళ్లిద్దరి కోసమే అని అనుకున్నారు ఆ తల్లిదండ్రులు. గొప్ప గొప్ప చదువులు చెప్పించాలని ఆశపడ్డారు. కానీ వాళ్ల కలలు ముణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయాయి. స్కూల్కు వెళ్లే వయసు కూడా రాకముందే ఇద్దరు చిన్నారులు అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఇద్దరు పిల్లలు ఒక్కసారే మరణించడం ఆ తల్లిదండ్రులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.
వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట మండలం సాలాబాద్కు చెందిన హరిప్రసాద్, విజయలక్ష్మీ దంపతులకు ఇద్దరు సంతానం. కొడుకు శ్రీహర్ష (6), కుమార్తె శ్రావ్య (4) ఉన్నారు. మాండూస్ తుఫాన్ కారణంగా రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలు శనివారం మధ్యాహ్నం కాస్త బ్రేక్ ఇవ్వడంతో అన్నాచెల్లెళ్లు ఇద్దరూ ఆడుకోవడానికి బయటకొచ్చారు.ఆ సమయంలో ఈదురుగాలులు ఎక్కువగా రావడంతో వారి చేతిలో ఉన్న గొడుగు ఎగిరి.. పక్కనే మరుగుదొడ్డి నిర్మాణం కోసం తవ్విన గుంతలో పడిపోయింది. గొడుగు తీసుకునే క్రమంలో చిన్నారులు ఇద్దరూ ఆ గుంతలో పడిపోయారు. నీటిలో మునిగిపోయారు. ఆడుకోవడానికి బయటకు వెళ్లిన పిల్లలు ఎంతసేపైనా ఇంట్లోకి రాకపోవడంతో హరిప్రసాద్ బయటకు వచ్చి చుట్టుపక్కల వెతికాడు. చిన్నారులు ఎక్కడా కనిపించలేదు. కానీ వాళ్లు తీసుకెళ్లిన గొడుగు మాత్రం మరుగుదొడ్డి గుంతలో కనిపించింది. దీంతో అనుమానం వచ్చిన హరిప్రసాద్ గుంతలోకి దిగి చూడగా.. పిల్లలిద్దరూ అపస్మారక స్థితిలో కనిపించారు. దీంతో వారిని 108 వాహనంలో హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ లాభం లేకపోయింది. చిన్నారులు ఇద్దరూ మృతిచెందారు. ఇద్దరు పిల్లలు ఒక్కసారిగా మరణించడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.
Read More Articles |
Nizamabad Bride | కాసేపట్లో పెళ్లనగా పెళ్లికూతురు ఆత్మహత్య.. వరుడి వేధింపులే కారణమా?
YS Sharmila Health Update | వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్ష భగ్నం.. అపోలో ఆస్పత్రికి తరలింపు