YS Sharmila Health Update | వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను శనివారం అర్దరాత్రి పోలీసులు భగ్నం చేశారు. హైదరాబాద్ లోటస్ పాండ్లోని తన నివాసంలో దీక్ష చేస్తున్న షర్మిలను బలవంతంగా అపోలో ఆస్పత్రికి తరలించారు. తన పాదయాత్రకు హైకోర్టు ఇచ్చినప్పటికీ పోలీసులు కావాలనే అడ్డుకుంటున్నారని షర్మిల దీక్ష చేపట్టారు. పాదయాత్రకు పర్మిషన్ ఇచ్చేదాక ఆమరణ దీక్ష కొనసాగుతుందని వైఎస్ ఆర్ టీపీ ( YSRTP ) అధ్యక్షురాలు షర్మిల మొండికేసి కూర్చున్నారు. అయితే హైదరాబాద్ లోటస్ పాండ్ లోని తన నివాసంలో ఆమరణ దీక్ష చేస్తున్న షర్మిల ఆరోగ్యం క్షీణిస్తోందని వైద్యులు తెలిపారు. శనివారం సాయంత్రం వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు డాక్టర్ సునీత ఆధ్వర్యంలోని వైద్యుల బృందం షర్మిలకు వైద్య పరీక్షలు నిర్వహించింది. బీపీ పడిపోయిందని, వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందించాలని సూచించింది. ఈ క్రమంలోనే ఆమె దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆస్పత్రికి తరలించారు
పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వాలంటూ షర్మిల రెండు రోజులుగా దీక్ష చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలను కూడా పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో వారు ఆందోళన చేస్తున్నారు. షర్మిల దీక్ష వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లోపలికి ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు షర్మిల కూడా ప్రజాప్రస్థానం పాదయాత్రకు పర్మిషన్ ఇచ్చేదాక దీక్ష కొనసాగిస్తానని తేల్చిచెప్పారు.