Sircilla | టైమ్2న్యూస్ : ఆన్లైన్లో కనిపించే ప్రకటనలు చూసి మోసపోవద్దని ఎంతలా వారిస్తున్న కొంతమంది తీరు మారడం లేదు. తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో సైబర్ నేరగాళ్లను నమ్ముతున్నారు. మోసపోయామని గ్రహించేలోపు జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఉదంతమే సిరిసిల్ల పట్టణంలో చోటు చేసుకుంది. వెబ్సైట్లో పెట్టుబడులు పెడితే రివార్డుల రూపంలో బోలెడంత డబ్బు సంపాదించవచ్చని భావించి యువతి లక్షన్నర పోగొట్టుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
సిరిసిల్ల పట్టణంలోని వెంకట్రావునగర్కు చెందిన గురిపెల్లి ఆకాంక్ష సాఫ్ట్వేర్ ఉద్యోగిని. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండటంతో మిగిలిన సమయంలో పార్ట్ టైమ్ జాబ్ చేసి మరింత డబ్బు సంపాదించాలని ఆశపడింది. దీనికోసం ఆన్లైన్లో పార్ట్ టైమ్ జాబ్స్ కోసం వెతికింది. అందులో కనిపించిన ఓ వెబ్సైట్ ఓపెన్ చేసిన తన సమాచారాన్ని అప్లోడ్ చేసింది. తమ వెబ్సైట్లో లాగిన్ అయినందుకు వెబ్ నిర్వాహకులు రివార్డుగా రూ.100 అందించారు. మరింత సమాచారం అప్లోడ్ చేసి పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో రివార్డు పొందవచ్చని నమ్మించారు. తక్కువ టైమ్లోనే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని ఆ యువతి ఆశపడింది. పలు దఫాలుగా వెబ్సైట్లో పెట్టుబడులు పెట్టింది. అలా ఏకంగా రూ.1,53,140 వరకు చెల్లించింది. కానీ ఆ యువతికి ఎలాంటి రివార్డు రాలేదు. ఇంతలోనే సంబంధిత వెబ్సైట్ కూడా ఆన్లైన్లో కనిపించలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆకాంక్ష.. సిరిసిల్ల పట్టణ పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేసినట్లు సిరిసిల్ల పట్టణ సీఐ అనిల్ కుమార్ తెలిపారు.